Shashi Tharoor | రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్ అన్నారు. అతిపెద్ద పార్టీగా నిలిచినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లు రాకపోవచ్చని, మిత్రపక్షాలు మద్దతు ఇచ్చేందుకు ఇష్టపడకపోవచ్చని అన్నారు. కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో శశిథరూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’పై స్పందించారు. భారతదేశం భిన్నత్వంతో నిండిన దేశమని, రాష్ట్రాల మధ్య వందశాతం ఏకాభిప్రాయం లేని పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తాను భావిస్తున్నానని.. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలు ఇష్టపడకపోవడంతో సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. వారంతా ఇండియా కూటమికి సహకరించేందుకు సిద్ధంగా ఉండవచ్చన్నారు. కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకంపై స్పందిస్తూ.. వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో పార్టీల మధ్య ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నామన్న ఆయన.. తద్వారా ఓటమిని తప్పించుకోవచ్చన్నారు.
ఇండియా కూటమిలో 28 ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని.. అభ్యర్థిని నిలబెట్టడానికి రాష్ట్రంలోని అన్ని ప్రతిపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంటుందన్నారు. ఎన్నికల్లో ఇద్దరు లేదంటే ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉండవచ్చన్నారు. ఈ పరిస్థితుల్లో ఓటరు ఉత్తమమైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. సీట్ల పంపకం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఇప్పటికే కూటమిలోని పార్టీలు కలిసిపోటీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.