PM Modi | న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల తర్వా త కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంటుందని, ఆ పార్టీ ‘దుకాణం’ మూసివేత అంచున ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ఒకే ప్రోడక్ట్ను పదేపదే లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మోదీ సోమవారం లోక్సభలో మాట్లాడారు.
దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. అదేవిధంగా కొన్ని దశాబ్దాల పాటు ప్రతిపక్షంలో ఉండాలని ఆ పార్టీ నిర్ణయించుకొన్నదని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లతో కలిపి ఎన్డీయే కూటమి మొత్తంగా 400కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తన మూడో టర్మ్లో భారత్కు రానున్న వేయ్యేండ్ల పాటు బలమైన పునాది వేస్తామని పేర్కొన్నారు.
భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, ఇది తన గ్యారెంటీ అని చెప్పారు. మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీలు భారతీయుల శక్తి సామర్థ్యాలను విశ్వసించలేదని, విదేశీయులతో పోలుస్తూ భారతీయులు నెమ్మదస్తులు, సోమరిపోతులు అని గతంలో ఎర్రకోట సాక్షిగా వ్యాఖ్యానించారని అన్నారు.
కాంగ్రెస్తో ప్రజాస్వామ్యానికి ప్రమాదమని. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఆ పార్టీ విఫలమైందని అన్నారు. దేశం సాధించిన విజయాలను కాంగ్రెస్ విస్మరిస్తున్నదని విమర్శించారు. నాయకుల కుటుంబసభ్యులు సొంత బలం, ప్రజల మద్దతుతో రాజకీయాల్లోని రావచ్చునని, అయితే ఒక కటుంబం పార్టీని నడుపుతూ, తమ సొంత వాళ్లను ప్రమోట్ చేయడమే వారసత్వ రాజకీయం అవుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.