Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానుండటంతో సార్వత్రిక ఎన్నికల సమరానికి కాషాయ పార్టీ సన్నద్ధమైంది. వంద మంది లోక్సభ అభ్యర్ధుల జాబితాను ఇప్పటికే బీజేపీ ఖరారు చేసింది. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో పార్టీ భాగస్వామ్య పక్షాలకు కేటాయించే సీట్లపై కసరత్తును కొలిక్కితీసుకొస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో యూపీలో భాగస్వామ్య పక్షాలకు 6 సీట్లు, అసోంలో 3, జార్ఖండ్లో 1 స్ధానాన్ని బీజేపీ కేటాయించనుంది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం రాత్రి జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక యూపీలో అప్నాద్ (సోనేలాల్), ఆరెల్డీలు రెండేసి స్ధానాలను పొందనుండగా, నిషాద్ పార్టీ, ఓం ప్రకాష్ రాజ్భర్ నేతృత్వంలోని ఎస్బీఎస్పీ పార్టీలు చెరొక స్ధానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది.
మరోవైపు అసోంలో ఏజీపీకి బీజేపీ రెండు స్ధానాలు కేటాయించనుండగా, మరో సీటును యునైటెడ్ పీపుల్స్ పార్టీకి కేటాయించవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక జార్ఖండ్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్కు ఓ స్ధానం కేటాయించనుంది. హరియాణాలోని మొత్తం 10 స్ధానాల్లో కాషాయ పార్టీ బరిలో దిగనుండగా బిహార్లో జేడీయూ, ఎల్జీపీ, ఎల్జేపీ (పశుపతి పరాస్), రాష్ట్రీయ లోక్ మోర్చా, జితన రాం మాంఝీ సారధ్యంలోని హిందుస్థానీ ఆవామ్ మోర్చాలతో సీట్ల సర్దుబాటుపై సంప్రదింపులు జరుగుతున్నాయి.
Read More :
LPG cylinder | వినియోగదారులకు షాక్.. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర