LPG cylinder | ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) మరోసారి షాక్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు (Commercial LPG cylinder) వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచాయి. 19 కేజీల సిలిండర్పై రూ.25.50 పెరిగింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం ప్రకటించాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అంటే మార్చి 1 నుంచే అమల్లోకి రానున్నట్లు వెల్లడించాయి.
ధరల పెంపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,795కు చేరింది. ముంబైలో ఇది రూ. 1,749కి చేరగా.. కోల్కతాలో రూ. 1,911, చెన్నైలో రూ.1,960.50 గా ఉంది. ఇక హైదరాబాద్ మహానగరంలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర గరిష్ట స్థాయిలో రూ. 2,027 వద్ద ఉండటం గమనార్హం. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి.
అయితే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని చమురు కంపెనీలు వెల్లడించాయి. మరోవైపు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచిన క్రమంలో విమానయాన ఇంధన ధరలను (ATF prices) కూడా ఆయిల్ కంపెనీలు పెంచాయి. డొమెస్టిక్ ఎయిర్లైన్స్కు ఏటీఎఫ్ ధర ఢిల్లీలో కిలోలీటర్కు రూ. 1,01,397కు పెరిగింది. కోల్కతాలో ఇది రూ. 1,10,297 గా ఉంది. ఇక ముంబై, చెన్నైలో దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధరలు వరుసగా కిలోలీటర్కు రూ.94,809, రూ.1,05,399కి పెరిగింది.
Also Read..
Gold Seized | తిరుచ్చి ఎయిర్పోర్ట్లో వెయ్యి గ్రాముల బంగారం పట్టివేత
Mahesh Babu | ఆసక్తికరంగా మహేశ్ బాబు నయా డెసిషన్.. అభిమానుల్లో జోష్