బల్లలు ఎక్కారు.. ఢీ అంటే ఢీ అనుకొన్నారు.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకొన్నారు! ఒకరినొకరు తోసుకొన్నారు.. నెట్టుకొన్నారు.. జుట్టు పట్టుకొని ఈడ్చుకొంటూ కొట్టుకొన్నారు! చొక్కాలు చించుకొని మరీ వీరంగం సృష్టించారు.. ఆఖరుకు మేయర్పైనే దాడికి పాల్పడ్డారు..! ఇవీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో కనిపించిన దృశ్యాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక రణరంగాన్ని తలపించింది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్ల ఘర్షణతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పోటాపోటీ నినాదాల దగ్గరి నుంచి కొట్టుకోవడం వరకు, చివరికి మేయర్పైనే దాడి చేసే వరకు ఇది వెళ్లింది. ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకొనేందుకు శుక్రవారం మేయర్ షెల్లీ ఒబెరాయ్ అధ్యక్షతన ఎంసీడీ కౌన్సిల్ సమావేశమైంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఒక ఓటు చెల్లదని ప్రకటించడంతో బీజేపీ సభ్యులు ఓట్ల లెక్కింపును అడ్డుకొన్నారు. చెల్లుబాటు కాని ఓటును మినహాయించి ఫలితాలను వెల్లడిస్తానని మేయర్ షెల్లీ ప్రకటించడంతో.. బీజేపీ కౌన్సిలర్లు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మీకు ఏమైనా మతి ఉన్నదా?’ అంటూ వీరంగం సృష్టించారు. దీంతో ఇరుపార్టీల సభ్యుల నినాదాలు, ఆందోళనలతో సభ అట్టుడుకిపోయింది. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఎన్నికను మేయర్ సోమవారానికి వాయిదా వేశారు.
సభలో తీవ్ర పరిణామాలు
మేయర్ ప్రకటనతో బీజేపీ సభ్యులు బల్లలు ఎక్కి ఆందోళన చేశారు. ప్రతిగా ఆప్ సభ్యులు కూడా బల్లలు ఎక్కారు. అనంతరం ఇది ఇరుపక్ష సభ్యుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకొన్నారు. నెట్టుకోవడంతో పాటు జట్టు పట్టుకొని, కొట్టుకొని గందరగోళం సృష్టించారు. ఈ సందర్భంగా కొంతమంది కౌన్సిలర్ల చొక్కాలు కూడా చిరిగిపోయాయి. పలువురికి గాయాలు కూడా అయినట్టు సమాచారం. ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు.
చిర్రెత్తిపోయిన బీజేపీ కౌన్సిలర్లు
మేయర్ ప్రకటనతో బీజేపీ కౌన్సిలర్లు చిర్రెత్తిపోయారు. మేయర్పై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘మీకేమైనా మతి ఉన్నదా?’ అంటూ దూషించారు. బీజేపీ సభ్యులు ‘జై శ్రీరామ్’తో పాటు ప్రధాని మోదీని పొగుడుతూ నినాదాలు ఎత్తుకొన్నారు. దీనికి ప్రతిగా ఆప్ సభ్యులు కూడా ‘ఆమ్ఆద్మీ పార్టీ జిందాబాద్, కేజ్రీవాల్ జిందాబాద్’ అని పోటీ నినాదాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మేయర్ కుర్చీలో నుంచి లేచి బయటకు వెళ్తున్న సమయంలో బీజేపీ సభ్యులు వెంటపడి మరీ దాడికి యత్నించారు. సిబ్బంది రక్షణ వలయం ఏర్పాటు చేసి ఆమెను తీసుకెళుతుండగా దాడి చేశారని ఆప్ ఓ వీడియో విడుదల చేసింది.