ఇంఫాల్ : మణిపూర్లో (Manipur) హింసాత్మక ఘటనల నేపధ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వెలుగుచూడటం కలకలం రేపింది. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో గురువారం ఉదయం ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ వీడియో ఆధారంగా సుప్రీంకోర్టు సమోటోగా ఈ ఘటనను పరిగణనలోకి తీసుకుంది. ఇక మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు చేపడతామని మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ స్పష్టం చేశారు.
ఈ ఘటన పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులను విడిచిపెట్టబోమని వారిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. మణిపూర్ హింసాకాండపై, ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదిపారు. ఇది నాగరిక ప్రపంచం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అని మోదీ పేర్కొన్నారు. మణిపూర్ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, ఈ ఘటనను రాజకీయం చేయవద్దని కోరారు. దేశం యావత్తూ ఈ ఘటనపై ఆగ్రహంతో ఉందని, నేరస్తులను తీవ్రంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
మణిపూర్లో కుకి-జోమి వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను కొందరు నగ్నంగా తీసుకువెళుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో బుధవారం వెలుగుచూసింది. రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటనలో మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై పలువురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మే 4న జరిగిందని, బాధితురాలిలో ఒకరు 19 ఏండ్ల యువతి అని పోలీస్ వర్గాలు తెలిపాయి.
Read More :
Parliament Monsoon Session | లోక్ సభ మధ్యాహ్నానికి వాయిదా