పాట్నా: డాక్టర్, ఆసుపత్రి సిబ్బంది కలిసి ఒక నర్సుపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు (Nurse gangraped). అనంతరం ఆమెను హత్య చేశారు. మృతదేహాన్ని అంబులెన్స్లో ఉంచి పారిపోయారు. పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. 30 ఏండ్ల మహిళ భర్త మరణించాడు. దీంతో నాలుగేండ్ల చిన్నారితో కలిసి తల్లి ఇంట్లో ఆమె ఉంటున్నది. మోతీహరిలోని జానకీ సేవా సదన్ నర్సింగ్ హోమ్ను డాక్టర్ జైప్రకాష్ దాస్, మంతోష్ కుమార్ నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ ఆ మహిళ తల్లిని కలిశారు. ఆమె కుమార్తెకు తమ క్లీనిక్లో నర్సుగా పని ఇప్పిస్తామని ఒప్పించారు.
కాగా, ఈ నెల 8న క్లీనిక్కు వెళ్లిన ఆ మహిళ ఇంటికి తిరిగి రాలేదు. డాక్టర్ జైప్రకాష్ దాస్, కాంపౌండర్లు కలిసి ఆ నర్సుపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేశారు. డాక్టర్ జైప్రకాష్ దాస్ మహిళ తల్లికి ఫోన్ చేశాడు. ఆమె కుమార్తె పరిస్థితి సీరియస్గా ఉందని, ముజఫర్పూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని చెప్పాడు. మహిళ తల్లి ఆ ఆసుపత్రికి వెళ్లగా కుమార్తె ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆమె కోసం అంతా వెతికింది. చివరకు ఒక అంబులెన్స్లో కుమార్తె మృతదేహం కనిపించింది.
మరోవైపు మృతురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సుపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన డాక్టర్, ఆసుపత్రి సిబ్బంది కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. ఒక కాంపౌండర్ను అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు.
కాగా, నర్సుగా ఆసుపత్రికి వెళ్లిన తొలి రోజు నుంచే తన కుమార్తెను వారు వేధించారని మహిళ తల్లి ఆరోపించినట్టు పోలీసులు తెలిపారు. దీంతో అక్కడికి వెళ్లనని ఆమె చెప్పిందని, అయితే మరోసారి అలా జరుగదని డాక్టర్ జైప్రకాష్ దాస్ హామీ ఇవ్వగా నర్సుగా అక్కడ పని చేస్తున్నట్టు ఆమె తల్లి చెప్పిందన్నారు.