Bihar elections : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) అన్ని విధాలుగా సిద్ధమైంది. నవంబర్ 22 లోగా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొంది. ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫొటోలను పెట్టనున్నామని, కలర్ ఫొటోలు పెట్టడం ఇదే తొలిసారి అని ఈసీఐ తెలిపింది.
బీహార్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రెండు రోజులపాటు పర్యటించి, సమీక్షించిన ఎన్నికల సంఘం.. వాటికి సంబంధించిన వివరాలను పట్నాలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించింది. ఈ సందర్భంగా పుట్టిన తేదీ, పౌరసత్వానికి ఆధార్ (Aadhaar) ధ్రువీకరణ కాదని మరోసారి స్పష్టంచేసింది. చట్టానికి లోబడే ఆధార్ను ఉపయోగిస్తున్నామని ఈసీ తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశామని, గరిష్ఠంగా 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండనుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పటికే బూత్ స్థాయి అధికారులకు శిక్షణ పూర్తిచేశామన్న ఈసీ.. ఎన్ని దశల్లో పోలింగ్ నిర్వహించాలనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫొటోలను ఉంచనున్నామని వెల్లడించింది.
తద్వారా అభ్యర్థులను ఓటర్లు తేలికగా గుర్తుపట్టేందుకు వీలుంటుందని ఈసీ తెలిపింది. సీరియల్ నంబర్ కూడా పెద్దగా కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. ఎస్ఐఆర్ ద్వారా అనర్హులను జాబితా నుంచి తొలగించామని, దీన్ని బీహార్ ఓటర్లు కూడా స్వాగతించారని పేర్కొంది. వీటిపై ఏమైనా అభ్యంతరాలుంటే తెలిపేందుకు రాజకీయ పార్టీలకు ఇంకా అవకాశం ఉందన్నారు.
కాగా 243 స్థానాలు కలిగిన బీహార్ అసెంబ్లీకి గడువు 2025 నవంబర్ 22తో ముగియనుంది. ఆ గడువులోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించిన ఈసీ.. గడువులోగా ఎన్నికలు పూర్తిచేస్తామని చెప్పింది. ఒకటి రెండు దశల్లోనే వీటిని పూర్తిచేయాలనే అభ్యర్థనలు వచ్చాయని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. 2020లో మూడు విడతల్లో పోలింగ్ జరుగగా.. అంతకుముందు ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహించారు. బీహార్లో 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది.