Prashant Kishore : బీహార్లో తమ పార్టీ అధికారంలోకి రాగానే మద్య నిషేధాన్ని రద్దు చేస్తామని జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు. అక్టోబర్ 2న తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లను వివరిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు. పీకే మీడియాతో మాట్లాడుతూ.. జన్ సురాజ్ ప్రభుత్వం ఏర్పడితే అధికారంలోకి వచ్చిన గంటలోపే బీహార్లో ఉన్న మద్యపాన నిషేధాన్ని ఎత్తేస్తామని వ్యాఖ్యానించారు. అందుకోసం తాము రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని చెప్పారు.
రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ రాష్ట్రంలో చేపట్టిన యాత్రపై పీకే మాట్లాడుతూ.. ఆయన కనీసం ఇప్పటికైనా ఇంటి నుంచి బయటకువచ్చి ప్రజల మధ్యకు వెళ్లడం మంచి పరిణామమే అన్నారు. తేజస్వి యాదవ్, సీఎం నితీశ్ కుమార్ వల్ల రాష్ట్రానికి నష్టం తప్ప ప్రయోజనం ఏమీ లేదని వ్యాఖ్యానించారు. బీహార్ ప్రజలు 30 ఏళ్లుగా వారిని భరిస్తున్నారని అన్నారు. ఇకనైనా వారు బీహార్ను విడిచిపెట్టాలని సూచించారు.
ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. బీహార్లో ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం ఉన్నప్పటికీ అభివృద్ధి సూచీల్లో వెనుకబడి ఉందని తేజస్వీ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆయన రాజకీయ నాయకుడు కావడానికి ఏకైక కారణం మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు కావడమే అని ఎద్దేవా చేశారు. కాగా బీహార్లో 2016 ఏప్రిల్ నుంచి మద్య నిషేధం అమల్లో ఉన్నది.