రాయ్పూర్ : మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తనను అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. మహదేవ్ యాప్ స్కామ్లో కీలక నిందితుడు శుభం సోని సీఎం సూచనల మేరకే తాను దుబాయ్ వెళ్లానని పేర్కొన్న నేపధ్యంలో భూపేష్ బఘేల్ బీజేపీపై విరుచుకుపడ్డారు. దుబాయ్లో గ్యాంబ్లింగ్ బిజినెస్ ప్రారంభించేలా సీఎం బఘేల్ తనను ప్రోత్సహించారని వీడియో మెసేజ్లో సోని ఆరోపించారు.
భిలాయ్లో తన అనుచరుల అరెస్ట్కు సంబంధించి తాను బఘేల్ను సంప్రదించానని సోని పేర్కొన్నారు. అయితే బీజేపీకి రాబోయే ఎన్నికల్లో లబ్ధి చేకూర్చేందుకే ఈ సమయంలో ఇలాంటి వీడియోను బహిర్గతం చేశారని అర్ధం చేసుకోవడం కష్టమేమీ కాదని బఘేల్ పేర్కొన్నారు. ఈడీని ప్రయోగించే ఈ తతంగం సాగిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందేనని చెప్పుకొచ్చారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈడీని వాడుకుంటున్నారని, ఈడీ సాయంతోనే ప్రస్తుతం బీజేపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిందని సీఎం ఎద్దేవా చేశారు.
వీడియో మెసేజ్లో శుభం సోని చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. అసలు అతడు ఎవరో కూడా తనకు తెలియదని, అతడిని తాను ఎన్నడూ కలవలేదని స్పష్టం చేశారు. ఏదైనా కార్యక్రమంలో అక్కడున్న వారిలో శుభం సోని ఉన్నాడో లేదో కూడా తనకు తెలియదని ట్విట్టర్ వేదికగా సీఎం రాసుకొచ్చారు. మహదేవ్ యాప్కు తాను యజమానినని అతడు చెప్పుకుంటుండగా ఈడీ రెండు రోజుల కిందట అతడు మహదేవ్ యాప్ మేనేజర్ అని పేర్కొందని భూపేష్ బఘేల్ గుర్తుచేశారు.చత్తీస్ఘఢ్ ప్రజలు అన్నీ అర్ధం చేసుకుంటారని, ఎన్నికల్లో ఈడీ, బీజేపీలకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కాగా మహదేవ్ యాప్ యజమానిగా చెబుతున్న సోని తాను 2021లో ఈ యాప్ ప్రారంభించానని, చత్తీస్ఘఢ్ సీఎంకు రూ. 508 కోట్లు చెల్లించానని, ఇందుకు తన వద్ద ఆధారాలున్నాయని ఆరోపించారు.
Read More :
KH234 | గెట్ రెడీ.. కమల్హాసన్, మణిరత్నం టైటిల్ అనౌన్స్మెంట్ టైం ఫిక్స్