Bengaluru | బెంగళూరు, మార్చి 15: బెంగళూరులో నీటి సంక్షోభం రోజు రోజుకూ ముదిరిపోతున్నది. మునుపెన్నడూ లేనంతగా నీటి కొరత ఏర్పడటంతో ప్రజలు ఇంట్లో వంట వండుకోవడం మానేసి రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు. అంతేగాక రెండు రోజులకోసారి స్నానాలు చేస్తున్నారు. ఇక మరీ ఘోరంగా మాల్స్లోని టాయిలెట్లను ఉపయోగించటం మొదలెట్టారు. సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరు మహానగర దుస్థితి ఇది. నీటి సంరక్షణ వ్యవస్థ ఉన్న బహుళ అంతస్తుల భవనాల్లో ఉన్నవారు కూడా ఇప్పుడు వారి కనీస నీటి అవసరాలు తీర్చుకోవటానికి వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు.
ఇక ఆహార పదార్థాలు తినటానికి, కాఫీలు, టీలు తాగటానికి డిస్పోజబుల్ కప్పులు, గ్లాసులు, ప్లేట్లు వినియోగిస్తున్నారు. నగరంలోని కోచింగ్ సెంటర్లు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించి ఆన్లైన్ తరగతులకు హాజరు కావాలని కోరుతున్నాయి. వారానికొకసారి వాషింగ్ మెషిన్లను ఉపయోగిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరోసారి వర్క్ ఫ్రం హోం కోరతామని, వర్షాలు పడే వరకు తాత్కాలికంగా తమిళనాడులోని మా స్వస్థలానికి వెళ్లిపోవాలనుకుంటున్నట్టు కొంత మంది బెంగళూరు వాసులు తెలిపారు. గత కొంత కాలంగా వర్షాలు లేకపోవటంతో ఈ దుర్భిక్షం దాపురించింది.
బెంగళూరు నగరానికి ప్రతి రోజు 2,600-2,800 మిలియన్ లీటర్ల నీరు అవసరం కాగా.. ప్రస్తుతం అందులో సగం నీరు కూడా సరఫరా కావటం లేదు. బెంగళూరు శివార్లలోని 110 గ్రామాలు కూడా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నీటి సంక్షోభం అటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ యుద్ధంగా మారింది. లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందిస్తూ బీజేపీ నిరసనలకు దిగింది. బీజేపీ పాలిత ఫెడరల్ ప్రభుత్వం కరువు పీడిత కర్ణాటకకు ఆర్థిక సాయం చేయడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తున్నది.