బెంగళూరు, మార్చి 11: బెంగళూరులో నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గత నాలుగు దశాబ్దాల్లో ఇలాంటి తీవ్రమైన కరువును రాష్ట్రం చూడలేదని పేర్కొన్నారు. రానున్న రెండు నెలలు చాలా కీలకమని.. అయితే బీజేపీ పేర్కొన్నట్టు పరిస్థితి ఎక్కువ తీవ్రంగా లేదన్నారు. బెంగళూరు నగర పరిధిలో అనధికార బోర్లు తవ్వేవారిపై కఠిన చర్యలు తీసుకొంటామన్నారు.
ఈ నెల 15 నుంచి బోర్లు తవ్వాలనుకొనేవారు తప్పనిసరిగా నీటి సరఫరా బోర్డు వెబ్సైట్లో దరఖాస్తు చేసి అనుమతి పొందాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేసే ప్రసక్తే లేదన్నారు. ఇటీవల విడుదల చేసిన జలాలు బెంగళూరు నగర అవసరాల కోసమని స్పష్టం చేశారు. ట్యాంకర్ల రవాణాను, వాటి ధరలను పర్యవేక్షిస్తామని.. బెంగళూరు నగరాభివృద్ధి, రాష్ట్ర జల శాఖలు పర్యవేక్షిస్తున్న శివకుమార్ వెల్లడించారు.
ప్రైవేట్ ట్యాంకర్లు ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకొనే గడువును ఈ నెల 15 వరకు పొడిగించామని తెలిపారు. కేఆర్ఎస్ జలాశయం నుంచి తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేశారని సోమవారం మండ్య జిల్లా కేంద్రంలో రైతులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని 223 తాలూకాల్లో 196 తీవ్రమైన కరువుతో అల్లాడుతున్నాయి.