Karnataka | బెంగళూరు: బెంగళూరులో ఎండాకాలం గడుస్తున్న కొద్దీ నీటి సంక్షోభం కూడా ముదురుతున్నది. తాగేందుకు, ఇతర అవసరాలకు సరిపడా నీరు లేక నగరవాసు లు నానా ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన నీటి కొరత నేపథ్యంలో తాగునీటిని వృథా చేయొద్దని సూచించిన బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ బోర్డు(బీడబ్ల్యూఎస్ఎస్బీ) అధికారులు.. తాజాగా తమ ఆదేశాలు ఉల్లంఘించారన్న కారణంతో నగరానికి చెందిన 22 కుటుంబాలపై రూ.5 వేల చొప్పున జరిమానా విధించి వసూలు చేశారు. తాగునీటిని వాహనాల వాషింగ్, గార్డెనింగ్ వంటి పనులకు ఉపయోగించినందుకు ఆయా కుటుంబాలపై జరిమానా వేసినట్టు వెల్లడించారు.
నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 22 కుటుంబాల నుంచి రూ.1.1 ల క్షలు వసూలు చేశామని, వాటిలో దక్షిణ ప్రాంతం నుంచే రూ.80 వేలు వచ్చాయని జలమండలి అధికారులు తెలిపారు. తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని బీడబ్ల్యూఎస్ఎస్బీ ఈనెల మొదట్లో సూచించింది. తాగునీటిని వాహనాలను కడగడం, నిర్మాణాలు, వినోద సంబంధిత కార్యక్రమాలకు వినియోగించద్దంది. తమ ఆదేశాలను ధిక్కరిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించిన బోర్డు.. ఉల్లంఘనను పునరావృతం చేస్తే అదనంగా ప్రతిసారి రూ.500 చొప్పున ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.