లక్నో: రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ‘80 ఓడించండి.. బీజేపీని పంపించండి’ అంటూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కొత్త నినాదం ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో యూపీలో మొత్తం 80 లోక్సభ స్థానాల్లోనూ బీజేపీని ఓడించడం ద్వారా కేంద్రంలో ఆ పార్టీని గద్దె దించాలని పిలుపునిచ్చారు.
80 స్థానాలనూ తామే దక్కించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. యూపీలో యోగి ఆధిత్యనాథ్ పాలన అవినీతిమయం అయ్యిందని, నేరాలు పెరిగిపోయాయని ఆయన విమర్శించారు. దొంగతనాల్లో పోలీసుల పాత్ర బయటపడుతున్నదని, దొంగ సొత్తు పోలీస్ స్టేషన్లలో దొరుకుతున్నదని పేర్కొన్నారు. ‘యూపీ ఈజ్ ఆఫ్ డూయింగ్’ అంటే హత్యలు, అత్యాచారాలు అని ఎద్దేవా చేశారు.