సిద్దిపేట జోన్, ఏప్రిల్ 16: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. తొలిరోజు 12 మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేసేందుకు మున్సిపల్ కార్యాలయంలో 14 కౌంటర్లను ఏర్పాటు చేశారు. నామినేషన్ల ఏర్పాట్ల ప్రక్రియను అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ముజామ్మిల్ ఖాన్ పర్యవేక్షించారు. భద్రతా ఏర్పాట్లను సీపీ జోయల్ డెవిస్ పరిశీలించారు. తొలిరోజు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఆశావహులు ఎక్కువగా పన్నుల చెల్లింపు, నోడ్యూస్ ధ్రువీకరణ పత్రాల కౌంటర్ల వద్ద పెద్దసంఖ్యలో బారులు తీరారు. తొలిరోజు నాల్గో వార్డు నుంచి టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి సతీమణి కొండం కవిత(టీఆర్ఎస్), 9వ వార్డు నుంచి ఇంజమూరి నరేశ్(సీపీఐ), 19వ వార్డులో దాసరి రాజు(కాంగ్రెస్), 34వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ గుడాల సంధ్య(టీఆర్ఎస్), 17వ వార్డు మల్యాల జ్యోతి(టీఆర్ఎస్), 5వ వార్డు వినోద్గౌడ్(టీఆర్ఎస్) 2 సెట్ల నామినేషన్లు, 28వ వార్డు జావిద్(టీఆర్ఎస్), గౌస్ మోహినొద్దీన్ చాంద్(కాంగ్రెస్), 27వ వార్డు నీలం సురేశ్(టీఆర్ఎస్), 19వ వార్డు పెర్క భాను(బీజేపీ) రెండు సెట్ల నామినేషన్లు, డీ.రాజలింగం(కాంగ్రెస్), 18వ వార్డు నుంచి అడ్డగట్ల కావేరి (టీఆర్ఎస్) నామినేషన్లు దాఖలు చేశారు.