కన్నా.. అమ్మ లేదురా.. ఇక తిరిగి రాదురా!

అమ్మ లేదని, ఇక ఎప్పటికీ తిరిగి రాదని ఆ పసివాడికి తెలియదు. అందుకే రైల్వే ప్లాట్ఫాంపై నిర్జీవంగా పడి ఉన్న తల్లి మీద కప్పి ఉంచిన దుప్పటితో ఆటలాడుకున్నాడు. బీహార్లోని ముజఫర్పూర్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న ఈ ఘటన హృదయాల్ని కదిలిస్తున్నది. అహ్మదాబాద్ నుంచి ముజఫర్పూర్కు శ్రామిక్ రైల్లో వచ్చిన ఆమె ఆహారం లేక మరణించారని ఆర్జేడీ నేత ఒకరు ఆరోపించారు.
శ్రామిక్ రైళ్లలో ఏడుగురి మృతి
కాన్పూర్: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్లకు వచ్చిన వేర్వేరు శ్రామిక్ రైళ్లలో ఏడుగురు వలస కార్మికులు బుధవారం మరణించారని అధికారులు తెలిపారు. బీహార్లోని ముజఫర్పూర్ రైల్వేస్టేషన్ ఫ్లాట్ఫామ్పై మరణించిన మహిళ నిద్ర పోయిందని భావించి ఆమె కొడుకు లేపుతున్న దృశ్యాన్ని వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో రైల్వే తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఢిల్లీ నుంచి బీహార్లోని ముజఫర్పూర్కు వచ్చిన ఓ రైలులో వలస కార్మికుడి నాలుగున్నరేండ్ల బాలుడు మరణించాడు. ముంబై నుంచి వారణాసికి వచ్చిన ఒక రైలులో ఇద్దరు ప్రయాణికులు మరణించారు. మడ్గావ్-దర్బంగా స్పెషల్ రైలులో వచ్చిన వ్యక్తి నేపాల్ వాసి అని, మంగళవారం వైద్య పరీక్షలు జరిపి బల్లియా జిల్లా దవాఖానలో చేర్చగా బుధవారం మరణించాడని అదనపు ఎస్పీ చెప్పారు. ఝాన్సీ, గోరఖ్పూర్లకు వచ్చిన వేర్వేరు శ్రామిక్ రైళ్లలో ప్రయాణించిన ఇద్దరు కార్మికులుమృతి చెందారని రైల్వే పోలీసులు తెలిపారు.