న్యూఢిల్లీ: ఎన్నికల బాండ్ల పథకంలో డాటా ఆధారంగా ‘క్విడ్ ప్రో కో’ ఉదంతాలపై కోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. రాజకీయ పార్టీలు, కార్పొరేట్లకు మధ్య నెలకొన్న ‘క్విడ్ ప్రో కో’ సంబంధాల్ని ఈ విచారణ బయటపెడుతుందని పిటిషన్ పేర్కొన్నది.
ఎస్బీఐ నుంచి వెలువడిన దాతల వివరాల ఆధారంగా రెండు ఎన్జీవో సంఘాలు సుప్రీంకోర్టులో సంయుక్తంగా ఓ పిటిషన్ వేశాయి. ఆయా రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాల్లో అత్యధిక భాగం.. అనుకూల విధానాల కోసం, దర్యాప్తు సంస్థల విచారణ నిలుపుదల కోసం ఇచ్చినట్టు పిటిషన్ ఆరోపించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది.