Makara Jyothi : శబరిమలకు వెళ్లిన అయ్యప్ప భక్తులకు మకర జ్యోతి దర్శనమిచ్చింది. పోన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమైంది. ఈ సందర్భంగా హరిహరక్షేత్రం శబరిమల ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయానికి ఈశాన్య దిశలో పర్వతశ్రేణుల నుంచి తళుక్కున మెరిసిన మకర జ్యోతిని దర్శించుకున్నారు.
జ్యోతి దర్శనంతో వేలాది మంది భక్తులు పులకించిపోయారు. హరిహర సుతుడైన అయ్యప్పను స్మరిస్తూ స్వామియే శరణం అయ్యప్ప అన్న శరణుఘోషలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జ్యోతి దర్శనానికి ముందు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు.
అనంతరం మూలమూర్తికి హారతినిచ్చారు. ఆ వెంటనే క్షణాల్లో చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమైంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు శబరిమలకు భారీగా తరలివచ్చారు.