బులంద్షహర్, జూన్ 9: బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో దళితులపై దాడులు ఆగడం లేదు. తాజాగా బులంద్షహర్ జిల్లాలోని ఖుర్జాలో ఉన్నతవర్గానికి చెందిన కొందరు యువకులు ఓ దళిత కుటుంబంపై కర్రలతో దాడి చేశారు. ఖుర్జా గ్రామ మాజీ పెద్ద మల్ఖన్సింగ్ తన కుటుంబంతో కలిసి సమీపంలోని ఓ గొట్టపుబావి వద్ద స్నానం చేసేందుకు వెళ్లారు.
అక్కడికి చేరుకున్న కొందరు ఉన్నతవర్గానికి చెందిన యువకులు తమతో పాటు స్నానం చేయకూడదని వారిని హెచ్చరించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తులైన ఆ యువకులు దళిత కుటుంబంపై కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో చిన్నారులతో పాటు మహిళలకు గాయాలయ్యాయి. గాయాలపాలైన దళిత కుటుంబాన్ని స్థానికులు దవాఖానకు తరలించారు. ఇప్పటివరకు నిందితులను పోలీసులు అరెస్టు చేయకపోవడం శోచనీయం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్టు పోలీస్ అధికారి శ్లోక్ కుమార్ తెలిపారు.