భోపాల్, జూలై 9: అమాయక గిరిజనులు, ఆదివాసీలు, దళితులపై మధ్యప్రదేశ్లో ఇటీవల వరుస దాడులు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తున్నదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దోషులకు సరైన శిక్షలు పడకపోవటమూ ఈ పరిస్థితికి కారణమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గ్వాలియర్లో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తూ కాలి పాదాల్ని నాకించిన ఘటనలో బాధితుడి వివరాల్ని బయటపెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. తాజాగా దొంగతనం చేశాడని ఒక వ్యక్తిని నగ్నంగా మార్చి కొంతమంది కొట్టారు.
దొంగతనం పేరుతో నగ్నంగా చేసి దాడి
దొంగతనం చేశాడన్న ఆరోపణపై సాగర్లో కొందరు ఒక వ్యక్తిని వివస్ర్తుడిని చేసి పైపులతో కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. నిందితుల కోసం గాలిస్తున్నామని అడిషనల్ ఎస్పీ విక్రమ్ సింగ్ కుష్వాహ తెలిపారు.
దళితులపై దాడులు అడ్డుకోలేరా?
పెండ్లి బరాత్లో డీజే పెట్టుకున్న దళితుడిపై షజాపూర్ జిల్లాలో దాడి జరిగింది. శివపూరి జిల్లా వర్ఖాడిలో ఇద్దరు దళితులపై దాడి చేసి కొట్టారు. రేవా జిల్లాలో కొంతమంది ఓ వ్యక్తి మెడలో చెప్పుల దండవేసి వికృతంగా వ్యవహరించారు. రాష్ట్రంలో దళితులపై దాడులను అడ్డుకోలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వమున్నదా అనే అనుమానం వ్యక్తమవుతున్నది.
మూత్ర విసర్జనలో ‘అసలు’ బాధితుడు ఎవరు?
బోఫాల్: మధ్యప్రదేశ్లో ఇటీవల జరిగిన మూత్ర విసర్జన ఘటనలో అసలు బాధితుడు ఎవరన్న విషయంపై సందిగ్ధత నెలకొన్నది. మూత్ర విసర్జన బాధితున్ని తాను కాదని, వీడియోలో ఉన్నదెవరో తెలియదని దశ్మత్ రావత్ ఆదివారం ఓ మీడియా సంస్థకు వెల్లడించాడు. మధ్యప్రదేశ్ సీఎం తనకు కాళ్లు కడిగిన తర్వాతనే, అందుకు గల కారణం తనకు తెలిసిందని ఆయన తెలిపారు. అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఉన్నది తాను కాదన్న విషయాన్ని కలెక్టర్ కూడా ధ్రువీకరించారని ఆయన తెలిపారు.