Cancer Matrimony | లక్షల జీతం, లక్షణమైన కుటుంబం ఉన్న వారికే సరైన తోడు దొరకడం కష్టం అవుతున్నది. ఇక, క్యాన్సర్ లాంటి తీవ్ర వ్యాధుల నుంచి కోలుకున్నవారికి, ఇప్పటికీ దీర్ఘకాలిక రుగ్మతలతో పోరాడుతున్నవారికి జీవిత భాగస్వామి లభించడం అసాధ్యమైన వ్యవహారమే. చూసిచూసి ఎవరు మాత్రం ధైర్యం చేస్తారు? అంతమాత్రాన ఆ జీవితాలు ఒంటరిగా గడిచిపోవాల్సిందేనా? ‘లేదు.. లేదు. మేమున్నాం’ అంటున్నాయి ‘ఆత్మన్ మ్యాట్రిమోనియల్’ లాంటి ఆన్లైన్ వివాహ వేదికలు.
ఎనిమిదేండ్ల కింది ముచ్చట… అప్పటికే నీల్కు (మారుపేరు) ముప్పయ్యేండ్లు దాటాయి. సంబంధాలు చూస్తున్నారు. తమ కొడుకు పెండ్లి అంత సులువైన పని కాదని అతని తల్లిదండ్రులకూ తెలుసు. నీల్ ఐటీ రంగంలో పెద్ద స్థాయిలో ఉన్నాడు. కానీ ఎంటెక్ చదువుతున్నప్పుడే హాడ్కిన్స్ లింఫోమా అనే క్యాన్సర్ బారిన పడ్డాడు. దాంతో ఆ ఇరవై మూడేండ్ల యువకుడి జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఐదేండ్లపాటు చికిత్స తీసుకున్నాడు. చాలా డబ్బు ఖర్చయ్యింది. దీనివల్ల, నీల్ వివాహ ప్రయత్నం వాయిదా పడింది. తన దోస్తులతో పోలిస్తే ఆలస్యంగా ఉద్యోగ జీవితం మొదలుపెట్టాడు. అలా 30వ ఏట పెండ్లి ప్రయత్నాలు ప్రారంభించాడు. మ్యారేజ్ బ్యూరోలు, ఆన్లైన్ వివాహ వేదికల్లో వివరాలు నమోదు చేసుకున్నాడు. అయితే తనకు పెండ్లి కూతురు దొరకడం కష్టమేనని నీల్కు తెలుసు. దానికి మానసికంగా సంసిద్ధంగా ఉన్నాడు కూడా. “నేను దేన్నీ దాచి ఉంచాలని అనుకోలేదు. క్యాన్సర్ నుంచి కోలుకున్నానని నా బయోడేటాలో స్పష్టంగా పేర్కొన్నాను” అంటాడు నీల్. అయితే, దాదాపు ఏడేండ్లపాటు నీల్ ప్రొఫైల్ పట్ల ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. పోనీ తన లాంటివాళ్లే ఎవరైనా దొరుకుతారేమోనని ఆదిశగా ప్రయత్నం మొదలుపెట్టాడు. మొత్తానికి ఎనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత నీల్ ఆశ ఫలించింది. తనలాగే క్యాన్సర్ను జయించిన రియాతో (మారుపేరు) అతని పెండ్లయింది. అందుకే “క్యాన్సర్ ఏదైనా సరే మీరు జీవితం గడిపేయవచ్చు. కానీ, పెండ్లి అంతకంటే ముఖ్యమైంది. తగిన తోడు ఉండాల్సిందే” అంటాడు నీల్. అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసిపెట్టిన సంస్థ ‘ఆత్మన్ మ్యాట్రిమోనియల్’ వెబ్సైట్. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న, కోలుకుంటున్నవారికి సరైన తోడును వెతికి పెట్టే భారాన్ని తలకెత్తుకున్న ఈ సంస్థ పుట్టుక కథ గురించి తెలుసుకోవాల్సిందే.
‘ఆత్మన్ మ్యాట్రిమోనియల్’ వెబ్సైట్ క్యాన్సర్, హెచ్ఐవీ, తలసేమియా, మధుమేహం, ఇతర అనారోగ్యాలు ఉన్నవాళ్లకు జీవిత భాగస్వాములను వెతికిపెడుతుంది. సుప్రియ షిండే, రాహుల్ షిండే దంపతులు దీనిని ప్రారంభించారు. ఈ దంపతులు తమ దగ్గరికి వచ్చేవారికి కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. పెండ్లయిన 15 రోజులకే రాహుల్కు క్రానిక్ మైలాయిడ్ లుకేమియా (సీఎంఎల్) అనే రక్త క్యాన్సర్ నిర్ధారణ అయ్యింది. దాంతో కొంతకాలానికి తన భర్త క్షేమం కోసం సుప్రియ ఇతర క్యాన్సర్ రోగులు, వారి కుటుంబసభ్యులతో సంప్రదింపులు మొదలు పెట్టింది. వారి అనుభవాలను అర్థం చేసుకుని భర్తకు సపర్యలు చేసింది. పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్ అండ్ రీసెర్చి సెంటర్లో కౌన్సెలింగ్ సెషన్లకూ హాజరయ్యింది. విస్తృత అధ్యయనం తర్వాత తమలాంటి వారికి సాయం చేసే సంస్థలు అంతగా లేవని రాహుల్, సుప్రియ గుర్తించారు. అలా ఇతరుల సహాయం కోసం చూడకుండా.. సొంతంగా ఏదైనా చేయాలని సంకల్పించుకున్నారు. అలా మొదలైందే ‘ఆత్మన్ మ్యాట్రిమొనీ’ వెబ్సైట్. దీని ప్రధాన కార్యాలయం పుణెలో ఉంది. వెబ్సైట్లో పేరు, వివరాలు నమోదు చేసుకున్నవారికి మొదట కౌన్సెలింగ్ ఇస్తారు. ఏ జంటకైనా కలిసి ఉండటం ఇష్టమైతే తమ అభిప్రాయాలు, ఆరోగ్య వివరాలను పంచుకునే అవకాశం ఇస్తారు. ఆ జంట పెండ్లికి సమ్మతిస్తే ఇద్దరి తరఫు డాక్టర్లతో రెండు కుటుంబాలతో సమావేశం ఏర్పాటు చేస్తారు. అలా ఒకరి గురించి ఒకరికి పూర్తి అవగాహన, నమ్మకం కుదిరిన తర్వాత పెండ్లి జరిపిస్తారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవాళ్లు, వాటిని జయించి కోలుకున్న వాళ్లు ఒక్కటయ్యారు. కాకపోతే పేర్లు నమోదు చేసుకుంటున్న అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంటున్నది. “నిజమే. ఈ ధోరణి కొంతబాధగా అనిపిస్తున్నది. అమ్మాయిల ఆరోగ్య వివరాలు చెప్పడానికి కుటుంబసభ్యులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో సరైన సంబంధాలు అందించలేకపోతున్నాం” అంటారు సుప్రియ.
‘డివైన్ రిలేషన్స్’ అనే వెబ్సైట్ కూడా దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి, వాటినుంచి కోలుకున్న వారికి అన్ని విధాలుగా తగిన సహాయం అందిస్తున్నది. దీనికి ఓ తండ్రి బాధ నేపథ్యంగా నిలవడం గమనార్హం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్- కలకత్తా పట్టభద్రుడైన వివేక్ శర్మ దీన్ని ప్రారంభించాడు. 2014లో వివేక్ ఐదేండ్ల కొడుకు అమోఘ్ మెదడులో రక్తస్రావమై చనిపోయాడు. దానికి కారణాలు తెలియదు. దాంతో ఆయన ముంబయిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లల కుటుంబసభ్యులకు సాయం చేయడానికి, తమలాంటి వాళ్లు ఒకరినొకరు కలుసుకోవడానికి డివైన్ రిలేషన్స్ ప్రారంభించాడు. 2016లో అమోఘ్ పుట్టినరోజు నవంబర్ 4న డివైన్ రిలేషన్స్ పురుడు పోసుకుంది.