Atishi Marlena | న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఆప్ కీలక నాయకురాలు, ఢిల్లీ మంత్రి ఆతిశీ సంచలన విషయాలు బయటపెట్టారు. బీజేపీలో చేరకపోతే నెల రోజుల్లో ఈడీ ద్వారా అరెస్టు అయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఓ వ్యక్తి ద్వారా బీజేపీ తనకు చెప్పించిందని ఆమె తెలిపారు. మంగళవారం ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ… త్వరలో తన ఇల్లు, తన సన్నిహితుల ఇండ్లలో ఈడీ సోదాలు చేపట్టబోతున్నదని, ఆ తర్వాత తనకు సమన్లు పంపించి అరెస్టు చేస్తుందని ఆమె పేర్కొన్నారు. ‘నాకు సన్నిహితుడైన ఒక వ్యక్తి ద్వారా బీజేపీ నన్ను సంప్రదించింది. నా రాజకీయ జీవితం కాపాడుకునేందుకు బీజేపీలో చేరాలని, లేకపోతే నెల రోజుల్లో అరెస్టు అవుతావని చెప్పించింది. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్ను అరెస్టు చేసిన తర్వాత ఆప్ విచ్ఛిన్నం అవుతుందని బీజేపీ ఆశించింది. కానీ అలా జరగకపోవడంతో తర్వాత కీలక నాయకులుగా ఉన్న నాతో పాటు సౌరభ్ భరద్వాజ్, రాఘవ్ చద్ధా, దుర్గేశ్ పాఠక్ను అరెస్టు చేయించబోతున్నది’ అని ఆమె పేర్కొన్నారు.‘మేము కేజ్రీవాల్ సైనికులం. భగత్ సింగ్ శిష్యులం. మీ బెదిరింపులకు భయపడబోమని బీజేపీకి చెప్పదలుచుకున్నా. దేశాన్ని రక్షించేందుకు, ప్రజల అభ్యున్నతికి ఆప్ చివరి కార్యకర్త వరకు పోరాడతారు’ అని ఆమె స్పష్టం చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయబోరని ఆతిశీ మరోసారి స్పష్టం చేశారు. కేజ్రీవాల్పై నేరం నిరూపణ కాలేదని, చార్జ్షీట్ కూడా దాఖలు చేయలేదని ఆమె గుర్తు చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆప్కి పూర్తి మెజారిటీ ఉందని, కాబట్టి కేజ్రీవాల్ రాజీనామా చేయాడానికి ఎలాంటి కారణం లేదని ఆమె పేర్కొన్నారు. మరోవైపు, ఆప్కి చెందిన 55 మంది ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్తో సమావేశమయ్యారు. కేజ్రీవాల్ రాజీనామా చేయొద్దని, జైలు నుంచే ఆయన ప్రభుత్వాన్ని నడిపించాలని ఎమ్మెల్యేలు ఆమెను కోరారు.
తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కార్యాలయంగా వినియోగించుకునేందుకు జైలు ఆవరణలో చిన్న స్థలం కేటాయించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాలని ఆప్ భావిస్తున్నది. ఈ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ సహా ముఖ్యమైన సదుపాయాలు కల్పించాలని కోరనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.