Atishi | ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత (AAP leader) మనీశ్ సిసోడియా (Manish Sisodia)కు భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు (Supreme Court) చేసింది. దీంతో 17 నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు రాబోతుండటంతో ఆప్ నేతలు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సిసోడియాకు బెయిల్ రావడంపై ఢిల్లీ మంత్రి అతిషీ (Atishi) సంతోషం వ్యక్తం చేశారు.
‘నిజం గెలిచింది..’ అంటూ కెమెరా ముందు తీవ్ర భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ‘17 నెలల పాటు జైలులో ఉన్న మనీశ్ సిసోడియాకు బెయిల్ లభించింది. ఈ రోజు నిజం గెలిచింది. ఇది ఢిల్లీ ప్రజల విజయం. విద్యార్థుల విజయం. సిసోడియా ఢిల్లీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తును అందించడం కొందరికి నచ్చలేదు. అందుకే తప్పుడు కేసులో ఇరికించి జైలుపాలు చేశారు. ఇప్పుడు న్యాయమే గెలిచింది’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక ఇదే కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ఇతర నేతలకు కూడా న్యాయం జరుగుతుందని అతిషీ ఆశాభావం వ్యక్తం చేశారు. వారు కూడా త్వరలోనే బయటకు వస్తారని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
#WATCH | Delhi Minister and AAP leader Atishi breaks down as she remembers AAP leader Manish Sisodia
He has been granted bail by the Supreme Court in the Delhi Excise policy case. pic.twitter.com/eh9oib3uRp
— ANI (@ANI) August 9, 2024
మద్యం కుంభకోణం కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సిసోడియాను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తీహార్ జైల్లోనే ఉంటున్నారు. బెయిల్ కోసం తీవ్రంగా పోరాటం చేశారు. ఈ క్రమంలో సుప్రీం తీర్పుతో 17 నెలలుగా జైలు జీవితాన్ని గడుపుతున్న సిసోడియాకు భారీ ఊరట లభించినట్లైంది. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై ఆమ్ ఆద్మీ పార్టీ సంతోషం వ్యక్తం చేసింది. చివరికి సత్యమే గెలిచింది అంటూ ఆప్ నేతలు సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నారు.
మరోవైపు ఇదే కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్టైన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో కేజ్రీని ఈడీ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన కూడా బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈడీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ప్రస్తుతం సీబీఐ కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
మరోవైపు కేజ్రీ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 20 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ గడువు ముగియడంతో సీబీఐ ఆయనను తిహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. మద్యం పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు సోమవారం కొట్టివేసిన విషయం తెలిసిందే.
#WATCH | Delhi Minister and AAP leader Atishi says, “Manish Sisodia has been granted bail today after being in jail for 17 months. This is the victory of truth. He was implicated in a false case. He gave a bright future to the children of Delhi. Today we are happy and now we are… pic.twitter.com/whPCUBMtwc
— ANI (@ANI) August 9, 2024
Also Read..
Raghav Chadha | పిల్లలూ మీ మనీశ్ అంకుల్ వచ్చేస్తున్నారు.. సిసోడియాకు బెయిల్ రావడంపై రాఘవ్ చద్దా
Manish Sisodia | సిసోడియాకు బెయిల్.. 17 నెలల తర్వాత భారీ ఊరట