BJP on Bihar | బిహార్లో రాజకీయంగా ఏకాకిగా మారిన బీజేపీ.. బలం పుంజుకోవడానికి కుయుక్తులు మొదలుపెట్టింది. ఇటీవలే బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకుని జేడీయూ నేత నితీశ్ కుమార్.. ఆర్జేడీ-కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలతో కలిసి సర్కార్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అకస్మాత్గా ఎన్డీఏ నుంచి వైదొలగాలని నితీశ్ కుమార్ తీసుకున్న నిర్ణయంతో బీజేపీ ఏకాకిగా మారినట్లు తెలుస్తున్నది. కీలక సామాజిక మద్దతు గల ఏ వర్గాన్ని వదల్లేదు జేడీయూ. నితీశ్కుమార్కు మద్దతుగా ఉన్న మోస్ట్ బాక్వర్డ్ కాస్ట్లు.. ఆయనతోపాటు వెళతాయని భావిస్తున్నారు. నాన్ యాదవ్ ఓబీసీలు (ఇతర వెనుకబడిన కులాలు) దళితులు, ముస్లింలు కూడా మహాఘట్బంధన్ (తేజస్వి యాదవ్ సారధ్యంలోని ఆర్జేడీ, కాంగ్రెస్, జీతన్ రాం మాంజీకి చెందిన హిందూస్థానీ అవామ్ మోర్చా) తోనే ఉంటారని సమాచారం.
ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో మేధోమధనం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలు ఉన్న కులాలపై దృష్టి సారించాలని, నితీశ్తో తలపడే నేతను ఖరారు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నితీశ్ కుమార్ థీమ్ లోగుట్టు బయట పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆర్జేడీ- కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్న నితీశ్కుమార్.. పశుపతి పరాస్ సారధ్యంలోని బీజేపీ మిత్రపక్షం లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ) మాత్రమే కమలనాథులతో సన్నిహితంగా ఉంది. బలం పుంజుకోవడానికి ఎల్జేపీ గ్రూపులను ఏకం చేయాలని కమలనాధులు భావిస్తున్నట్లు వినికిడి.
బీహార్ బీజేపీలోనూ సంస్థాగతంగా పెద్దపెద్ద మార్పులు చేపట్టడానికి కమలనాథులు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. వచ్చేనెలలో బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా సంజయ్ జైశ్వాల్ పదవీ కాలం ముగియడంతోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తారని సమాచారం. గతవారం బీజేపీతో బంధం తెంచుకుని మహాఘట్బంధన్తో కలిసి నితీశ్ సర్కార్ ఏర్పాటు చేశారు. మంగళవారం 31 మందితో క్యాబినెట్ విస్తరించారు. ఆర్జేడీ నుంచి 16 మంది, జేడీయూ నుంచి 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.