న్యూఢిల్లీ, డిసెంబర్ 2: నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలవుతుందని, తొలుత పోస్టల్ బ్యాలెట్స్ తెరుస్తామని ఆయా రాష్ర్టాల ఎన్నికల ముఖ్య అధికారులు శనివారం మీడియాకు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం అయినట్టు ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అవుతాయని, వాటి కంటే ఓటరు ఇచ్చిన తీర్పే కీలకమని మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రకటించారు. మధ్యప్రదేశ్లో బీజేపీ, రాజస్థాన్లో కాంగ్రెస్..అధికారాన్ని నిలబెట్టుకునేందుకు పోరాడుతున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వాటికి అనుకూలంగా ఉన్నప్పటికీ, విజయంపై స్పష్టత లేదు. దీంతో తమ తమ పార్టీల్లోని రెబెల్స్, స్వతంత్రులు, చిన్న చిన్న పార్టీలతో బీజేపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలు రహస్య మంతనాలు జరుపుతున్నారు. రాజస్థాన్లో బీఎస్పీ, భారతీయ ట్రైబల్ పార్టీ, భారత ఆదివాసీ పార్టీ..వంటి చిన్న పార్టీలతో ఒక దఫా ఇప్పటికే మాట్లాడారు.
మధ్యప్రదేశ్లో బీజేపీకి కష్టమే!
ఇక్కడ మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఈసారి రికార్డ్ స్థాయిలో 77.82 శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్నాథ్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విశ్వసించటం లేదన్నారు. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ శనివారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
రాజస్థాన్లో మెజార్టీ మార్క్ దాటితే చాలు..
రాజస్థాన్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొన్నది. మొత్తం అసెంబ్లీ స్థానాలు 200 కాగా, 199 స్థానాలకు నవంబర్ 25న పోలింగ్ జరిగింది. ఇక్కడ రెండు పార్టీలకు చెందిన రెబెల్స్ దాదాపు 40 మంది ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఈ స్థానాల్లో ఆయా పార్టీల ఫలితాలు కచ్చితంగా తారుమారు అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెజార్టీ మార్క్ (100)కు దగ్గరగా వచ్చి ఆగిపోతే ఎట్లా? అని కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ వ్యూహాలకు తెరలేపాయి. రెబెల్స్, స్వతంత్రులు, చిన్న పార్టీలతో ముందస్తు చర్చలు మొదలుపెట్టాయి.
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నిలిచేనా!
ప్రధాని మోదీ పాపులారిటీ నమ్ముకున్న బీజేపీకి ఈసారి నిరాశే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. సీఎం భూపేశ్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్కు స్వల్ప మెజార్టీ దక్కుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీఎస్పీ, జనతా కాంగ్రెస్, జీజీపీ, హెచ్ఆర్పీ, వామపక్షాలు..పొందే ఓట్లు ఫలితాల్ని తారుమారు చేసే అవకాశముంది. 2018లో కాంగ్రెస్ 68, బీజేపీ-15 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ అవినీతి పాలన, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు, మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం..ఎన్నికల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఇండియా కూటమిపై ప్రభావం
నాలుగు రాష్ర్టాల ఎన్నికల ఫలితాల ప్రభావం ‘విపక్ష ఇండియా’ కూటమిపై పెద్ద ఎత్తున ఉండబోతున్నది. కూటమిలో అతిపెద్ద పార్టీగా వున్న కాంగ్రెస్ గెలుపు విపక్ష కూటమిలో అనూహ్య మార్పులకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో సీట్ల సర్దుబాటు పేరుతో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు టీఎంసీ, ఆప్, సమాజ్వాదీలను షాక్కు గురి చేసింది. చివరి నిమిషం వరకు తమను వేచి చూసేలా చేసి..చివరికి తమను దెబ్బ తీసిందని కాంగ్రెస్ తీరుపై సమాజ్వాదీ, ఆప్ నేతలు మండిపడ్డారు.