గువాహతి: బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అస్సాం ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నది. నాలుగు వేలకుపైగా కేసులు నమోదు చేసిన ఆ రాష్ట్ర పోలీసులు 8,134 మందిని నిందితులుగా పేర్కొన్నారు. శనివారం నాటికి 2,211 మంది మగవారిని అరెస్ట్ చేశారు. వారం రోజుల్లో సుమారు 3,500 మందిని అరెస్ట్ చేస్తామని సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. బాల్య వివాహాల కేసులపై చర్యలు కొనసాగుతాయని చెప్పారు.
మరోవైపు బాల్య వివాహ కేసులకు సంబంధించి కేవలం మగవారిని మాత్రమే అరెస్ట్ చేయడంపై వారి భార్యలు, తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. తమ వారిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. తమ భర్తలు, కుమారులను అరెస్ట్ చేస్తే తాము ఎలా బతకాలి అంటూ పలువురు భార్యలు, తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వారిని విడుదల చేయాలని మహిళలు డిమాండ్ చేశారు.
కాగా, తమ కుమారుడు మైనర్ బాలికతో కలిసి పారిపోయాడని, అయితే పోలీసులు తన భర్తను అరెస్ట్ చేశారంటూ ఒక మహిళ వాపోయింది. తన మరదలకు 17 ఏళ్లప్పుడు పెళ్లయ్యిందని, ఇప్పుడు ఆమె వయసు 19 ఏళ్లని, ఐదు నెలల గర్భవతి అని ఒక మహిళ తెలిపింది. ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారని, ఇప్పుడు ఆమెను ఎవరు చూస్తారని ప్రశ్నించింది. మరోవైపు మహిళలు, పిల్లల రోదనల వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.