గువాహటి, జనవరి 25: అస్సాంలో న్యాయ్యాత్ర చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. యాత్రలో రాహుల్ డూప్ను వాడుతున్నారని మీడియా కథనాలను ఉదహరించారు. బస్సులో ఒక గదిలో రాహుల్ చాలాసేపు కూర్చుంటున్నారని తెలిపారు. ‘మామూలుగా రాహుల్ బస్సులోనే కూర్చొంటారని కాంగ్రెస్ నేతలు కొందరు నాతో చెప్పారు. అలాంటప్పుడు రాహుల్లాగా కనిపిస్తున్న మరో వ్యక్తి ఎవరు? రాహుల్ బస్సులో కూర్చొని టీ, స్నాక్స్ ఆస్వాదిస్తారు. మా రాష్ట్రంలో జరిగిన ప్రతి ప్రాంతంలో బీజేపీ గెలుస్తుంది. వాళ్ల యాత్ర ఉద్దేశం మత ఘర్షణలు సృష్టించేందుకేనా?’ అని హిమంత ప్రశ్నించారు.
మరోవైపు రాహుల్ యాత్రపై నమోదైన కేసుల్లో లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత అరెస్టులు ఉంటాయని హిమంత ఎక్స్లో వెల్లడించారు. రాహుల్ యాత్రలో తెల్లని టీ షర్ట్ వేసుకొని, గడ్డంతో రాహుల్ లాగే కనిపించే భోపాల్కు చెందిన రాకేశ్ కుశ్వాలాను న్యూస్ 18 పలుకరించింది. ఆయన న్యాయ్ యాత్ర ప్రారంభం నుంచి రాహుల్ గాంధీతో పాటు యాత్రలో పాల్గొంటున్నారు. ‘నేను యువజన కాంగ్రెలో ఉన్నప్పటి నుంచీ రాహుల్ను అనుసరిస్తున్నాను. భారత్ జోడో యాత్ర జరిగినప్పుడు నేను రాహుల్ గాంధీని కలిసిన తర్వాత అందరి దృష్టి నావైపు మళ్లింది. దేశ ప్రజలు నన్ను రాహుల్ గాంధీతో పోల్చడం గర్వంగా ఉంది’ అని రాకేశ్ వెల్లడించారు.