న్యూఢిల్లీ: ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు జరుగుతండగానే.. మరోవైపు రాహుల్గాంధీ తమ పార్టీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే పేరును ప్రస్తావించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ పేరుకే అధ్యక్ష ఎన్నికలు నిర్వహించిందని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ముందుగా నమ్మకస్తుడైన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ను పార్టీ అధ్యక్షుడిని చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించిందని, అయితే ఆయన వెనుకడుగు వేయడంతో మరో నమ్మకస్తుడైన ఖర్గేకు ఆ అవకాశం ఇచ్చిందని విమర్శిస్తున్నాయి.
పైకి తటస్థంగా ఉన్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ చెబుతున్నా.. లోలోపల మాత్రం ఖర్గేకే ఓటు వేయాలని ఆ పార్టీ ప్రతినిధులకు సూచనలు వెళ్లాయని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. అందుకే ప్రచారంలో భాగంగా అభ్యర్థులు ఏ రాష్ట్రానికి వెళ్లినా.. అక్కడి పార్టీ శ్రేణులు ఖర్గేకు ఘన స్వాగతాలు పలికి, శశి థరూర్తో మాత్రం అంటీ ముట్టనట్టుగా వ్యవహరించారని చెబుతున్నాయి. ఇవాళ భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్గాంధీ ఆంధ్రప్రదేశ్కు వెళ్లారు. అక్కడ కర్నూలు జిల్లాలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా.. గాంధీల కుటుంబేతర వ్యక్తి అధ్యక్షుడు కాబోతున్నందున పార్టీలో మీరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి రాహుల్ వెంటనే స్పందిస్తూ.. ఆ ప్రశ్న ఖర్గేను అడగాలి అన్నారు. అధ్యక్షుడిగా ఆయన పాత్ర ఏమిటో.. పార్టీలో నా పాత్ర ఏమిటో ఆయనే నిర్ణయిస్తారని చెప్పారు. తన తల్లి సోనియాపాటు అధ్యక్షుడు ఖర్గే ఏ పని చెబితే అది చేయడమే నా డ్యూటీ అన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తికాకుండానే, ఫలితం రాకముందే రాహుల్ అధ్యక్షుడిగా ఖర్గే పేరును ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.