లక్నో : రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)తో పొత్తు వార్తలను యూపీ ఏఐఎంఐఎం అధ్యక్షుడు షౌకత్ అలీ ఖండించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. యూపీలో ఒకవేళ సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లిం నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేస్తే పొత్తుకు తాము ఓకే అన్న వార్తలను ఆయన ఖండించారు. తాను గానీ తమ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గానీ ఈ విషయంలో ఎటువంటి ప్రకటన చేయలేదన్నారు. గత ఎన్నికల్లో ఎస్పీ 20 శాతం ముస్లిం ఓట్లను పొందింది. అయినప్పటికీ ముస్లిం నాయకుడిని ఉప ముఖ్యమంత్రిగా చేయలేదన్నారు.
కాగా అసదుద్దీన్ ఓవైసీ శనివారం స్పందిస్తూ.. ముస్లిం ఎమ్మెల్యేను ఉప ముఖ్యమంత్రి చేసేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అంగీకరిస్తే పొత్తు కుదుర్చుకునేందుకు తాము సిద్ధమేనని తెలిపారు. అంతకుక్రితం ఆయన మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం 100 స్థానాల్లో పోటీచేయనున్నట్లు వెల్లడించారు. 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30 నుంచి 39 శాతం వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. 44 స్థానాల్లో 40 నుంచి 49 శాతంగా అదే 11స్థానాల్లో 50 నుంచి 65 శాతంగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఒవైసీ ఇటీవలే లక్నోను సందర్శించారు.