అమరావతి : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) కడపలో వైసీపీ అభ్యర్థి అవినాష్రెడ్డిపై చేస్తున్న ఆరోపణలకు మరింత పదును పెడుతున్నారు. బాబాయి వైఎస్ వివేకా హత్యను కేంద్రంగా చేసుకుంటూ రోజుకో ప్రకటనతో అధికార వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తుంది. కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న షర్మిల ప్రధాన ప్రత్యర్థి, సిట్టింగ్ ఎంపీ అవినాష్రెడ్డి (Avinash reddy) పై విమర్శల స్థాయిని పెంచారు. దేవుడు తమవైపే ఉంటాడని .. గొడ్డలతో నరికే వాళ్ల వైపు కాదని బుధవారం కడపలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆరోపించారు.
వైఎస్ వివేకా హత్య ( Viveka murder case) లో నిందితుడు అవినాష్రెడ్డికి ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే పోలీసులు అరెస్టు చేస్తారని గ్రహించి ఊరు దాటి వెళ్లేందుకు పాస్పోర్టులు కూడా సిద్ధం చేసుకున్నారని విమర్శించారు. ఎంపీగా అవినాష్రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్లేనని పేర్కొన్నారు. ప్రజలకు ఎంపీ అందుబాటులో ఉండాలంటే నాకు ఓటేయ్యాలని, మీ ఎంపీని జైలులో కలవాలంటే అవినాష్రెడ్డికి ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. నిజాయితీగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని స్పష్టం చేశారు.