న్యూఢిల్లీ : హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా జహన్గిరిపురి హింసాకాండ పట్ల ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీ పోలీసులపై మండిపడ్డారు. అధికారుల నుంచి అనుమతి లేకుండా శోభా యాత్రను ఎలా కొనసాగించారని పోలీసులు మౌన ప్రేక్షకుల్లా వ్యవహరించారని ఆరోపించారు. జహన్గిరిపురిలో అనుమతి లేకుండా ఊరేగింపు చేపట్టారని ఢిల్లీ పోలీస్ కమిషనర్ చెప్పారని ఓవైసీ ప్రస్తావించారు.
అనుమతి లేకుండా ప్రదర్శన జరపడం, తుపాకులు, కత్తులు ప్రదర్శించడం చేస్తుంటే పోలీసులు ఎందుకు మౌనం దాల్చారని ప్రశ్నించారు. అసలు అనుమతి లేని ప్రదర్శనను ఎందుకు అనుమతించారని ఢిల్లీ పోలీసులను ఆయన నిలదీశారు. అదే రూట్లో అంతకుముందు రెండు యాత్రలు వెళ్లాయని వాటికి కూడా అనుమతి లేదని చెప్పారు. ఊరేగింపులో ఆయుధాలను ఎందుకు వాడాల్సి వచ్చిందని ప్రశ్నించారు. యాత్ర సందర్భంగా రెచ్చగొట్టే నినాదాలు చేశారని, కాషా పతాకాలను ఎగురవేసే ప్రయత్నాలు చేశారని చెప్పారు.
కాగా జహన్గిరిపురిలో మసీదుపై కాషాయ పతాకాన్ని ప్రదర్శనకారులు ఎగురవేసేందుకు ప్రయత్నించారనే వార్తలను ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్ధానా తోసిపుచ్చారు. మరోవైపు జహన్గిరిపురి హింసాకాండకు సంబంధించి ఇద్దరు మైనర్లు సహా 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తుపాకీతో కాల్పులు జరిపి అల్లర్లకు ప్రేరేపించారే ఆరోపణలు ఎదుర్కొన్న అన్వర్, ఆయన అనుచరుడు అస్లాంను రోహిణి కోర్ట్ ఆదేశాలతో పోలీస్ కస్టడీకి తరలించారు. ఈ ఘటనపై 14 పోలీస్ బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి.