Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడ్నెళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఇద్దరు విద్యార్థులను సాయుధ వ్యక్తులు కిడ్నాప్ చేసి, హత్య చేసిన విషయం తాజాగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. వారి మృతదేహాల ఫొటోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యను నిరసిస్తూ విద్యార్థులు రెండో రోజు బుధవారం కూడా ఇంఫాల్ నగరంతోపాటు పలు ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగించారు.
తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ పోలీసు అధికారి (senior IPS officer) రాకేష్ బల్వాల్ (Rakesh Balwal)ను రంగంలోకి దింపింది. జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ (Srinagar) ఎస్ఎస్పీ (Senior Superintendent of Police)గా విధులు నిర్వహిస్తున్న బల్వాల్ను తన సొంత కేడర్ అయిన మణిపూర్కు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
రాజస్థాన్కు చెందిన రాకేష్ బల్వాల్.. 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. మణిపూర్ కేడర్లో ఐపీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2018లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీ (NIA)కి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పదోన్నతి పొందారు. 2019లో పుల్వామా ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపిన బృందంలో బల్వాల్ సభ్యుడిగా ఉన్నారు. 2021లో శ్రీనగర్లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు చేపట్టారు.
మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు (Manipur Students) శవమై తేలారు. జూలైలో ఆచూకీలేకుండా పోయిన ఇద్దరు విద్యార్థుల ఫోటోలు రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఇద్దరి మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. 17 ఏళ్ల హిజామ్ లింతోయింగంబి, 20 ఏళ్ల ఫిజమ్ హేమ్జిత్ .. సాయుధుల మధ్య ఉన్న ఫోటోలను రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరూ చనిపోయినట్లు ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఓ జంగిల్ క్యాంపు వద్ద ఆ ఇద్దరూ హతమైనట్లు తెలుస్తోంది. జూలై నుంచి అదృశ్యమైన ఆ ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు జరుగుతోంది. ఈ కేసును సీబీఐ విచారిస్తున్నది.
కాగా, కుకీ, మెయిటీ కమ్యూనిటీల మధ్య నెలకొన్న ఘర్షణలతో దాదాపు నాలుగు నెలలుగా మణిపూర్ అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఈశాన్య రాష్ట్రంలో నెలకొన్న జాత్యహంకార ఘర్షణలను చల్లార్చేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ శాంతి నెలకొనలేదు సరికదా రోజురోజుకూ ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరింత క్షీణించాయి. ఇప్పటికీ కొందరు అల్లరి మూకలు, నిషేధిత ఉగ్రవాదులు అక్కడక్కడా దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో హింస చెలరేగినప్పటి నుంచి ఇప్పటి వరకూ 175 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,118 మంది గాయపడ్డారు. సుమారు 33 మంది అదృశ్యమయ్యారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు కొంతమేర అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇటీవలే ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది. దీంతో రాష్ట్రంలో అల్లర్లు మొదలైన తర్వాత జూలై నెలలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు ఉన్న ఫొటోలు ఇంటర్నెట్లో దర్శనమిచ్చాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఈ ఘటనకు నిరసనగా వందలాది విద్యార్థులు నిరసన చేపట్టారు.
తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం మళ్లీ మెబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించింది. అక్టోబర్ 1 వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు వెల్లడించింది. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటు రాష్ట్రంలోని 19 పోలీసుస్టేషన్ల పరిధిలోని ప్రాంతాలు మినహా రాష్ట్రం మొత్తాన్ని ‘కల్లోలిత ప్రాంతం’గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పీఏ)ను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర గవర్నర్ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.
Also Read..
Bengaluru | వరుస సెలవులు.. బెంగళూరులో భారీగా ట్రాఫిక్ జామ్
Rajasthan | కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 27వ ఘటన
CV Anand | ఇంట్లోనే వినాయకుడి నిమజ్జనం చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.. వీడియో