న్యూఢిల్లీ, అక్టోబర్ 6: వైజాగ్ బీచ్కు వెళ్లి సేద తీరాలనుకొంటున్నారా? గోవా బీచుల్లో ఎంజాయ్ చేద్దామనుకొంటున్నారా? తీర ప్రాంతాలకు వెళ్లి ఫిషింగ్ చేయాలని చూస్తున్నారా? ఇలాంటి కలలు ఉంటే వెంటనే తీర్చేసుకోండి. కొద్దిరోజులాగితే ఆ అవకాశం ఉండనే ఉండదు. ఎందుకంటారా? బీచ్లను తవ్వేందుకు కేంద్రం అనుమతి ఇవ్వబోతున్నది మరి. బీచ్ శాండ్ మైనింగ్ (తీర ప్రాంతాల్లోని ఇసుకను తవ్వి, ప్రాసెస్ చేసి ఖనిజాలను అమ్మేసుకొంటారు) చేసేందుకు ప్రైవేట్ కంపెనీలకు కేంద్రం ఓకే చెప్పబోతున్నది. దానికోసం చట్టంలో సవరణలు కూడా ప్రతిపాదించింది. అంటే.. బీచ్లన్నీ మైనింగ్ అడ్డాలుగా మారిపోతాయి. సాధారణ ప్రజలు బీచ్లకు వెళ్లే అవకాశమే ఉండదు. టూరిజంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా తన పరిధిలోని తీర ప్రాంతాలపై ఉన్న హక్కులను రాష్ర్టాలు కోల్పోతాయి.
బీచ్ శాండ్ మైనింగ్ చేసేందుకు ప్రైవేట్ సంస్థలకు అనుమతులు ఇస్తే.. అణుశక్తి ఉత్పత్తికి వాడే ఖనిజాలు వెలికి తీస్తారని కేంద్రం భావించి 2019 ఫిబ్రవరిలో దానిపై నిషేధం విధించింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపింది. తాజాగా, కేంద్రం దాన్నుంచి యూటర్న్ తీసుకొన్నది. ఈ ఏడాది మే 25న కేంద్ర మైనింగ్ శాఖ.. బీచ్ శాండ్ మైనింగ్కు ప్రైవేట్ కంపెనీలకు అనుమతి ఇచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆగస్టు వరకు సలహాలు, సూచనలు కూడా కోరింది. ఇప్పుడిక శీతాకాలపు పార్లమెంట్ సమావేశాల్లో మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్-1975కు సవరణ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.
బీచ్ శాండ్ మైనింగ్పై నిర్ణయం తీసుకొనే అధికారం ప్రస్తుతం రాష్ర్టాలకే ఉన్నది. తమ పరిధిలోని తీర ప్రాంతంపై హక్కులు రాష్ర్టాలవే. ప్రకృతి వనరులను కాపాడుకోవటం, అవసరానికి వినియోగించటం, మైన్ బ్లాకుల వేలం, మైనింగ్ లైసెన్స్ జారీ లాంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోవే. కానీ, ప్రతిపాదిత సవరణలతో రాష్ట్ర ప్రభుత్వాలు హక్కులు కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. కేంద్రానిదే తుది నిర్ణయం అవుతుంది. దీనివల్ల సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. రాష్ర్టాల హక్కులే కాదు, దేశ భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరో విషయమేమిటంటే.. ఎక్కువ బీచ్లు ఉన్నవి బీజేపీయేతర రాష్ర్టాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోనే. అంటే.. ఆయా రాష్ర్టాలపై కేంద్రం పెత్తనం చెలాయించాలని చూస్తుందనటానికి మరో రుజువు అని విశ్లేషకులు అంటున్నారు.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో 2013లో భారీ బీచ్ శాండ్ మైనింగ్ వెలుగుచూసింది. దీనిపై అప్పటి సీఎం జయలలిత విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. ప్రైవేట్ కంపెనీలకు అక్రమ మైనింగ్కు పాల్పడటంతో ప్రభుత్వానికి రూ.లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఆ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతున్నది.
ఇసుకను ప్రాసెస్ చేసి టైటానియం డయాక్సైడ్, ఇల్మెనైట్, రుటైల్, జిర్కాన్, గార్నెట్, సిలిమనైట్, ల్యూకోక్సీన్, ఇతర విలువైన ఖనిజాలను వెలికి తీసి అమ్మేస్తారు. ఇందులో కొన్ని ఖనిజాలను సన్ స్క్రీన్లు, కాస్మెటిక్, పెయింట్లు, ప్లాస్టిక్, ఫ్యాబ్రిక్, పేపర్ తయారీలో వాడుతారు.
బీచ్ శాండ్ మైనింగ్లో కాలు పెట్టేందుకు అదానీ గ్రూప్ సిద్ధమవుతున్నది. అందులో భాగంగానే రెండు కొత్త కంపెనీలను రిజిస్టర్ చేసింది. అయితే, ఇన్నేండ్లు బీచ్ శాండ్ మైనింగ్పై నిషేధం విధించినే కేంద్రం.. ఉన్నట్టుండి నిషేధం ఎత్తివేసేందుకు రంగం సిద్ధం చేస్తుండటంపై విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీర ప్రాంతాలను అదానీకి కట్టబెట్టేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంటున్నదని ఆరోపిస్తున్నారు. ఎలాగూ చిన్న కంపెనీలు పోటీలో నిలవవు. అలాంటప్పుడు బీచ్ శాండ్ మైనింగ్ అంతా కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోతుందని పేర్కొంటున్నారు.