న్యూఢిల్లీ : గుజరాత్ను 27 ఏండ్లుగా పాలిస్తున్న బీజేపీలో అహంభావం పెరిగిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో శనివారం నుంచి రెండురోజుల పాటు కేజ్రీవాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తాను ఢిల్లీ సీఎం అయినా ఇక్కడకు వచ్చి కల్తీ మద్యం ఘటనలో బాధితులను కలుసుకున్నానని, గుజరాత్ సీఎం మాత్రం ప్రజల కడగండ్లను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కల్తీ మద్యం బాధితులను గుజరాత్ సీఎం కనీసం పరామర్శించలేదని విమర్శించారు. గుజరాత్లో కాషాయ పార్టీకి ఆప్ ప్రత్నామ్నాయంగా ముందుకొచ్చిందని అన్నారు. కేజ్రీవాల్ ర్యాలీకి హాజరు కారాదని గుజరాత్ వ్యాపారులను రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తోందని ఆప్ చీఫ్ మండిపడ్డారు. స్వాతంత్ర్యానంతరం మనం 75 ఏండ్లలో ఎంతో సాధించామని, అయితే ఈ సమయంలో మనల్ని అభివృద్ధిలో దాటిపోయిన దేశాలు ఎన్నో ఉన్నాయని, మనం ఎందుకు వెనకబడ్డామని, మనకు తక్కువైన అంశాలేంటని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
గుజరాత్లో వ్యాపారులను జీఎస్టీ అధికారులు వేధిస్తున్నారని, అణిచివేత రాజకీయాలకు పాల్పడవద్దని తాను బీజేపీకి విజ్ఞప్తి చేస్తున్నానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో తాము బీజేపీకి చెందిన వ్యాపారులను ఎవరినీ వేధించలేదని, బెదిరింపులకు పాల్పడలేదని, వ్యాపారుల హృదయాలను గెలుచుకున్నామని చెప్పారు. గుజరాత్లో మద్య నిషేధం అమల్లో ఉన్నా రాష్ట్రంలో మద్యం చాలా సులభంగా లభిస్తోందని, నేరుగా ఇండ్లకే మద్యం డెలివరీ అవుతోందని కేజ్రీవాల్ దుయ్యబట్టారు.