న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. రాజధాని నగరంలో ఏకపక్షంగా 15 ఏండ్లపాటు చక్రం తిప్పిన బీజేపీ కంచుకోటను ఆప్ బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. ఢిల్లీలో మూడు కార్పొరేషన్లుగా ఉన్న పురపాలికను ఇటీవలే ఒకే కార్పొరేషన్గా మార్చారు. ఎంసీడీలోని మొత్తం 250 సీట్లకుగాను ఆప్ 134 సీట్లు గెలుపొందింది. బీజేపీ 104 వార్డుల్లో గెలువగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 9 స్థానాలను మాత్రమే దక్కించుకున్నది. బీజేపీ ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా నియోజకవర్గంలోని 4 వార్డుల్లోనూ కమలం పార్టీ ఓటమి పాలవ్వడం గమనార్హం.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా చెప్పుకొనే బీజేపీ.. అతి చిన్న పార్టీ చేతిలో ఓడిపోయింది అని ఆప్ ఎంపీ సంజయ్సింగ్ అన్నారు. తమది నీతి, నిజాయితీగల పార్టీ అని మరోసారి రుజువైందని చెప్పారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఎంసీడీ ఎన్నికలు నిర్వహించారు. బీజేపీ అధికారంలో ఉన్న ఈ రెండు రాష్ర్టాల్లో ఆప్ పోటీకి దిగింది. కేజ్రీవాల్ సహా ఆప్ కీలక నేతలందరూ ఆ రెండు రాష్ర్టాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఎంసీడీ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఈ నెల 1, 5 తేదీల్లో గుజరాత్ ఎన్నికలు జరుగగా, 4న ఎంసీడీ ఎన్నికల పోలింగ్ నిర్వహించారు.
కేజ్రీవాల్ సహా ఆప్ కీలక నేతలెవ్వరూ పెద్దగా ప్రచారం చేయకపోయినా ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడం విశేషం. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఏడుగురు ముఖ్యమంత్రులు, 17 మంది కేంద్ర మంత్రులు, 100 మంది ఎంపీలు ప్రచారం చేశారని, అయినప్పటికీ నగర ప్రజలు ఆప్కే పట్టం కట్టారని సంజయ్సింగ్ అన్నారు. ఢిల్లీలోని ఆప్ కార్యాలయంలో సంబురాలు మిన్నంటాయి. ‘అచ్చే హోంగే పాంచ్ సాల్.. ఎంసీడీమే భీ కేజ్రీవాల్ (ఎంసీడీలోకి కూడా కేజ్రీవాల్ వచ్చినందున వచ్చే ఐదేండ్లు బాగుంటాయి) అని రాసి ఉన్న భారీ హోర్డింగులను కార్యకర్తలు ఏర్పాటుచేశారు.
ప్రధాని ఆశీర్వాదం కావాలి
ఎంసీడీలో ఆప్ విజయం అనంతరం పార్టీ కార్యాలయంలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని, ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ సహా అందరి సహకారం కావాలని అన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, ప్రధాని ఆశీర్వాదం ఉండాలని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ విజయాన్ని ఆపాలని బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అభివృద్ధి కోసం పనిచేసిన వారికే నగరవాసులు పట్టం కట్టారని అన్నారు. కేజ్రీవాల్పై బీజేపీ చల్లుతున్న బురదను తుడిచేసిన ఢిల్లీవాసులు ఎంసీడీ బాధ్యతలను కూడా తనకే కట్టబెట్టారని అన్నారు.
మద్యం కుంభకోణాన్ని పట్టించుకోని ఢిల్లీ
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించేందుకు బీజేపీ పన్నని కుయుక్తి లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆప్ మంత్రి, ఇతర నేతల హస్తముందంటూ తీవ్రస్థాయిలో ప్రచారం చేశారు. జైలులో ఉన్న ఆప్ నేత సత్యేంద్ర జైన్ వీవీఐపీ సదుపాయాలు పొందుతున్నారంటూ రోజుకో వీడియో విడుదల చేశారు. మద్యం కుంభకోణం చుట్టే ఎంసీడీ ఎన్నికలను తిప్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఢిల్లీ వాసులు ఇవేవీ నమ్మకుండా ‘ఆమ్ ఆద్మీ’ వైపే నిలుచున్నారు.
ఎంసీడీ ఫలితాలు
మొత్తం వార్డులు : 250
ఆప్ : 134
బీజేపీ : 104
కాంగ్రెస్ : 9
ఇతరులు : 3