న్యూఢిల్లీ : ఉచిత హామీలతో దేశాభివృద్ధి కుంటుపడుతుందని ఇలాంటి వాటిని ఉత్తరాది స్వీట్ రెవ్దితో పోల్చిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీటుగా స్పందించారు. ఉచిత విద్య, వైద్యం తాయిలాలు కాదని స్పష్టం చేశారు. ఢిల్లీలోని 18 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వారికి ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నానని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
వారికి ఉచిత విద్య అందించడం తాను చేసిన నేరమా అని ఆప్ చీఫ్ నిలదీశారు. 1947, 1950 ప్రాంతాల్లోనే ఇవన్నీ చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. దేశ పురోభివృద్ధికి మనం పునాది వేస్తున్నామని, ఇవేమీ ఉచిత తాయిలాలు కాదని తేల్చిచెప్పారు. తనను విమర్శిస్తున్నవారు తమ కోసం ఏకంగా విమానాలు, ప్రైవేట్ జెట్లు కొనుగోలు చేసేందుకు వేలాది కోట్లు వెచ్చిస్తున్నారని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.
కేజ్రీవాల్ తన కోసం విమానాలు కొనుగోలు చేయలేదని, ఢిల్లీలో తాను పలు ఉచిత పధకాలు అమలు చేస్తున్నా తమ బడ్జెట్ లాభాల బాటలో ఉందని పేర్కొన్నారు. తాను ఈ విషయం చెప్పడం లేదని కాగ్ తాజా నివేదికే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాగా యూపీలో బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ఉచిత హామీలు దేశ అభివృద్ధికి విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత ఇలాంటి హామీల వలలో పడవద్దని సూచించారు.