Arvind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్లో ఆప్కు ప్రతికూలంగా ఫలితాలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్లలో 15 శాతం నుంచి 20 శాతం ఓట్లు మాత్రమే ఆప్ అభ్యర్థులకు పడ్డాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఈ ఫలితాలపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగానే ఉన్నాయని అన్నారు.
‘తొలిసారి పోటీ చేసినప్పటికీ దాదాపు 15 నుంచి 20 శాతం ఓట్లను దక్కించుకోవడమంటే మాటలు కాదు. అదికూడా బీజేపీకి కంచుకోట వంటి రాష్ట్రంలో ఈ స్థాయిలో ఫలితాలు రాబట్టడం సాధారణ విషయం కాదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పార్టీకి సానుకూలంగానే ఉన్నట్లు మేం భావిస్తున్నాం’ అని కేజ్రీవాల్ అన్నారు.
కాగా, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆప్కు ప్రతికూలంగా రావడంపై ఆ పార్టీ నేత రాఘవ్ చద్దా సైతం స్పందించారు. ‘ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎప్పుడూ బీజేపీకి అనుకూలంగానే ఉంటాయి. ఆప్ ఓటర్లు మౌనంగా, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. వాళ్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు చిక్కరు’ అంటూ కామెంట్ చేశారు.