న్యూఢిల్లీ : రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో దేశ రాజధానిలో (Delhi Floods) జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ జలమయమై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగర డ్రైనేజ్ వ్యవస్ధపై ఢిల్లీ వాసులు నిలదీస్తుండటంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అసాధారణ వర్షాలను తట్టుకునేలా ఢిల్లీలో వ్యవస్ధల డిజైన్ లేదని వ్యాఖ్యానించారు.
కుండపోతతో ప్రధాన రహదారులు, విద్యా సంస్ధలు, వాణిజ్య సంస్ధలు నీట మునగడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్ధితి. ఇది ఒకరిపై ఒకరు నిందలు మోపుకునే సమయం కాదని, ప్రజలకు ఉపశమనం కలిగించేలా వరద ప్రభావిత రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని వరద పరిస్ధితిపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం కేజ్రీవాల్ పేర్కొన్నారు.
గత రెండు రోజులుగా ఢిల్లీలో 153ఎంఎం వర్షపాతం నమోదైందని చెబుతూ యమునా నది ప్రమాదస్ధాయిని మించి ప్రవహిస్తుండటంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. యమునా నదికి వరద నీరు ఇంతకు మించి పెద్దగా రాదని, వరద ప్రవాహం పెరిగితే లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు.
Read More :