Yamuna | న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో యమునా నదికి వరద పోటెత్తింది. వరదలు దేశ రాజధాని ఢిల్లీని చుట్టుముట్టాయి. భారీ వర్షాలు, వరదలతో ఢిల్లీ అంతా జలమయం అయింది. దీంతో ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ అతిషి పలు ప్రాంతాలను పరిశీలించారు. ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న యమునా నదిని ఆమె పరిశీలించి, తగు సూచనలు చేశారు. యమునా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో అత్యధికంగా 153 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఒక్కరోజులో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం 1982 తర్వాత ఇప్పుడే అని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. హర్యానాలోని హీరాకుండ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో యమునా వరద పోటెత్తినట్లు తెలిపారు. 2.79 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద 203.33 మీటర్ల వద్ద యమునా ప్రవహిస్తోంది. యమునా వార్నింగ్ లెవల్ వచ్చేసి 204.50 మీటర్లు. ఈ క్రమంలో అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.
ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సబ్జి మండి ఏరియాలో వెటర్నరీ హాస్పిటల్ గోడ కూలడంతో ఓ మహిళ చనిపోయింది. రోహిణి ఏరియాలో 49 ఏండ్ల ఆటో డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అతని ఆటోపై చెట్టు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడిని రాజేందర్గా గుర్తించారు పోలీసులు. ఢిల్లీ వ్యాప్తంగా 13 ఇండ్లు నేలమట్టం అయ్యాయి.
#WATCH | Delhi: PWD (Public Works Department) Minister Atishi inspects Yamuna River pic.twitter.com/FVhJToBcqv
— ANI (@ANI) July 10, 2023