Arvind Kejriwal : ప్రపంచంలో అతిపెద్ద పార్టీ చండీఘఢ్ మేయర్ ఎన్నికల్లో ఓట్ల చోరీకి తెగబడిందని బీజేపీపై ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. మేయర్ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలను నిరసిస్తూ శుక్రవారం ఢిల్లీలో ఆప్ నిర్వహించిన ర్యాలీని ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. రానున్న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ గందరగోళం సృష్టించేందుకు బీజేపీ వెనుకాడదని ఆరోపించారు.
చండీఘఢ్ మేయర్ ఎన్నికల్లో ఓట్లు దొంగిలిస్తూ ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ పట్టుబడిందని ఎద్దేవా చేశారు. అక్రమాలకు పాల్పడుతూ బీజేపీ నేతలు వీడియోకు అడ్డంగా దొరికారని అన్నారు. బీజేపీ కార్యకర్తను ప్రిసైడింగ్ అధికారిగా నియమించారని అన్నారు. మేయర్ ఎన్నికల్లోనే అవకతవకలకు పాల్పడిన బీజేపీ ఇక అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఎలా వ్యవహరిస్తుందో ఊహించుకోవచ్చని చెప్పారు.
బీజేపీ దేశ ప్రజాస్వామ్యానికి ముప్పని హెచ్చరించారు. కాగా చండీఘఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి మనోజ్ సోంకర్కు 16 ఓట్లు పోలవగా, ఆప్ అభ్యర్ధి కుల్దీప్ కుమార్కు 12 ఓట్లు వచ్చాయి. 8 ఓట్లు చెల్లుబాటు కాలేదని ప్రకటించారు. ప్రిసైడింగ్ అధికారి బ్యాలెట్ పేపర్లను బీజేపీకి అనుకూలంగా తారుమారు చేశారని ఆప్ ఆరోపిస్తోంది.
Read More :
PMAY | మధ్య తరగతి కోసం కొత్త హౌసింగ్ స్కీం.. మరో 2 కోట్ల ఇండ్ల నిర్మాణం