PMAY | న్యూఢిల్లీ: రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మధ్య తరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు కేంద్ర సర్కారు కొత్త హౌసింగ్ స్కీంను ప్రకటించింది. బస్తీలు, అద్దె ఇంట్లో ఉండేవారికి సొంతింటి కలను నిజం చేసేందుకు కొత్త స్కీంను తీసుకొస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
అలాగే, పీఎం ఆవాస్ యోజన(గ్రామీణ్) కింద రాబోయే ఐదేండ్లలో మరో 2 కోట్ల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. 2024-25 మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ కరోనా సమయంలోనూ పీఎం ఆవాస్ యోజన(గ్రామీణ్) కొనసాగిందని, 3 కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని త్వరలో చేరుకోనున్నామని తెలిపారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని రాబోయే ఐదేండ్లు ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. మొత్తం 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్టు తెలిపారు.