న్యూఢిల్లీ, మే 3: ‘ఆపదలో ఉన్న వారికి చెప్పే ధైర్య వచనాలు.. వారిని ఆ గండం నుంచి సగం వరకు బయట పడేట్టు చేస్తాయి’ – పెద్దలు చెప్పిన ఈ మాటలను చేతల్లో చేసి చూపిస్తున్నారు భారత సాయుధ దళాలు. కరోనా విలయతాండవంతో అతలాకుతలమవుతున్న దేశాన్ని మహమ్మారి బారినుంచి బయటపడేట్టు చేయడానికి త్రివిధ దళాలు సమాయత్తమయ్యాయి. ‘కొ-జీత్’ (కలిసి గెలుద్దాం) పేరిట ఓ భారీ ఆపరేషన్ను ప్రారంభించాయి. ఈ మేరకు డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (మెడికల్) లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ మాధురి కానిట్కర్ వెల్లడించారు. సాయుధ దళాల్లో ఈమెను ‘రాజమాత’ అని ప్రేమగా పిలుస్తారు.
దేశాన్ని అతలాకుతలం చేస్తున్న కొవిడ్ సెకండ్ వేవ్ను ఒక యుద్ధంగా భావిస్తూ.. మహమ్మారి నియంత్రణకు తీసుకొచ్చిన ప్రత్యేక కార్యచరణే ‘కొ-జీత్’. ఈ ఆపరేషన్లో భాగంగా రోగుల తాకిడితో కుదేలైన వైద్య వ్యవస్థను బలోపేతం చేయడం, ఆక్సిజన్ సరఫరా గొలుసుకు ఆటంకాలు రాకుండా చూడటం, దవాఖానల్లో పడకల ఏర్పాటు, వైద్య సేవల్లో ప్రభుత్వ యంత్రాంగానికి తోడ్పాటు, కొవిడ్-19 రోగులకు మనోధైర్యాన్ని అందించి భరోసానివ్వడం వంటి చర్యలను చేపట్టనున్నారు.
‘కరోనా వంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒత్తిడిలో ఉన్న రోగులతో మాట్లాడితే వారికి గొప్ప ఊరటగా ఉంటుంది’ అని కానిట్కర్ తెలిపారు. సాయుధ దళాల మాజీ సిబ్బంది మిలిటరీ దవాఖానల్లో సేవలు అందిస్తున్నారని ఆమె తెలిపారు. ఢిల్లీ, పుణెలో 400-500 పడకల సామర్థ్యంతో దవాఖానలను ఏర్పాటు చేశామన్నారు. ‘కొ-జీత్’ అంటే త్రివిధ దళాలు కలిసికట్టుగా పనిచేసి కరోనాపై కలిసి విజయం సాధించడమని అభివర్ణించారు. ‘యుద్ధంలో ఎంతటి కఠిన పరిస్థితుల్లో కూడా సైనికులు వెన్ను చూపరు. ఈ కరోనా యుద్ధంలో మేము కూడా అంతే. మేము కేవలం వైద్యులమే కాదు. సైనికులం కూడా’ అని అన్నారు. దేశంలో నెలకొన్న ఆక్సిజన్ కొరతపై కానిట్కర్ స్పందించారు. ఇప్పటికే పలు మిలిటరీ దవాఖానల్లో సొంత ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయన్నారు. అయితే, ప్రస్తుత అవసరాలకు అవి సరిపోకపోవడంతో మరో 46 ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. ఆక్సిజన్ సరఫరాకు నేవీతోపాటు 200 మంది డ్రైవర్లు అహర్నిశలు పనిచేస్తున్నట్టు తెలిపారు.
సాయుధ దళాల్లో త్రీస్టార్ జనరల్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) హోదా కలిగిన మూడో మహిళగా కానిట్కర్ నిలిచారు. ఈమె భర్త లెఫ్టినెంట్ జనరల్గా రిటైర్ ఆయ్యారు. సైన్యంలో దంపతులు ఈ హోదాకు రావడం ఇదే తొలిసారి. 1982లో కానిట్కర్ సైన్యంలో చేరారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో డీన్గా పనిచేశారు. ‘సమస్యలు నిన్ను నాశనం చేయడానికి రావు. నీలోని శక్తి-సామర్థ్యాలను బయటకు తీసుకురావడానికే అవి వస్తాయి’ అన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మాటలే తనకు స్ఫూర్తి అని కానిట్కర్ చెబుతారు.