Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు భారత్ గురించి చెడుగా మాట్లాడటం అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ ఆరోపించారు. ఈసీ వంటి భారత రాజ్యాంగ వ్యవస్ధలను కూడా ఆయన తూలనాడుతుంటారని అన్నారు. కేంద్ర మంత్రి శుక్రవారం రాజస్ధాన్లోని దౌసాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికలు సజావుగా జరగని పక్షంలో విపక్షాలకు అన్ని సీట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బీజేపీ రిజర్వేషన్లను తొలగించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజల్లో రాహుల్ గాంధీ గందరగోళం సృష్టించారని దుయ్యబట్టారు.
అసలు రిజర్వేషన్లను తొలగించాలనే ఆలోచన రాహుల్ గాంధీ మెదడులో ఉందనే విషయం ఇప్పుడు వెల్లడైందని మంత్రి పేర్కొన్నారు. కాగా, రిజర్వేషన్ల తొలగింపుపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తప్పుపట్టారు. తేజస్వి బెంగళూర్లో శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రిజర్వేషన్ల తొలగింపుపై రాహుల్ వ్యాఖ్యలు ఆందోళనకరమని చెప్పారు. రాహుల్ గాంధీ ఎవరెవరితో సమావేశమవుతున్నారో చూస్తే విస్మయం కలుగుతుందని అన్నారు. భారత్ వ్యతిరేకి ఇల్హర్ ఒమర్తో రాహుల్ భేటీ అయ్యారని, ఖలిస్తాన్, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఏజెంట్లతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
రాహుల్ గాంధీ ఓరోజు ఉగ్రవాదులతో సమావేశమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో కేంద్ర ప్రభుత్వం సహా బీజేపీ, ఆరెస్సెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించడం పట్ల కాషాయ నేతలు భగ్గుమన్నారు. విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించడం రాహుల్కు అలవాటుగా మారిందని మండిపడుతున్నారు. ఇక రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ దినేష్ శర్మ స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భారత్ ఎకానమీ ప్రపంచంలో 11వ స్ధానంలో ఉండగా ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద 5వ ఎకానమీగా ఎదిగిందని అన్నారు.
Read More :
Nayanthara | నా ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్ అయ్యింది : నయనతార