Delhi CM | ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరు కొనసాగుతారనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత అతిశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి అరవింద్ కేజ్రీవాల్నే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. జైలు నుంచే కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడిపిస్తారని అతిశీ వెల్లడించారు. ముఖ్యమంత్రిని ఈడీ అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని చెప్పారు. దీనిపై ఇవాళ రాత్రే విచారణ జరపాలని కోరామని తెలిపారు.
కాగా, ఢిల్లీ మద్యం కేసులో ఇప్పటివరకు ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఇదే కేసులో ఈడీ అధికారులు ఇప్పటివరకు తొమ్మిదిసార్లు కేజ్రీవాల్కు సమన్లు జారీ చేశారు. కానీ ఆయన హాజరుకాలేదు. ఈ క్రమంలో ఇవాళ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు దాదాపు రెండున్నర గంటల పాటు ఆయన్ను ప్రశ్నించారు. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.