శ్రీనగర్: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపక్ష ఇండియా కూటమికి (India alliance) వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఇప్పటికే కూటమి నుంచి జేడీయూ బయటకు వెళ్లగా, పశ్చిమబెంగాల్లో తాము ఒంటరిగానే పోటీచేస్తామని మమతా బెనర్జీ ప్రకటించారు. అదేవిధంగా పంజాబ్, ఢిల్లీలోని అన్ని స్థానాల్లో ఆప్ బరిలోకి దిగుతుందని అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. తాజాగా, జమ్ముకశ్మీర్లో కూడా ఇలాంటి సమస్యే ఉత్పన్నమయింది. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) సారధ్యంలోని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (PDP) లోక్సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించింది. పార్టీ పార్లమెంటరీ కమిటీ త్వరలో అభ్యర్థుల పేర్లను ప్రకటించనుందని తెలుస్తున్నది. గతంలోనే నేషనల్ కాన్ఫరెన్స్ (NC) తాము ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేస్తామని ప్రకటించింది.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి చర్చించేందుకు సెంట్రల్ కశ్మీర్లో జరిగిన పీడీపీ సమావేశంలో మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు పార్టీ సిద్ధమైందని, త్వరలో రాష్ట్రంలోని లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనున్నామని ప్రకటించారు. మహ్మద్ సర్తాజ్ మదానీ నేతృత్వంలోని పార్టీ పార్లమెంటరీ బోర్డు త్వరలో అభ్యర్థులను ఖరారు చేస్తుందని వెల్లడించారు.