Rashtrapati Bhavan : ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్.. ప్రకృతి అందానికి కూడా పేరెన్నికగన్నది. ముఖ్యంగా ఇక్కడి మొఘల్ గార్డెన్స్, అందులోని పూల మొక్కలు, వాటి పూలు.. ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే, అంత అందమైన ఇక్కడి ప్రకృతిని ఎప్పుడు పడితే అప్పుడు చూసేయడం కుదరదు. కానీ, ప్రతి ఏడాది కొంతకాలం పాటు సాధారణ ప్రజలకు సందర్శనకు అనుమతిస్తారు.
ఈ ఏడాది కూడా అమృత్ ఉద్యాన్ పేరుతో సందర్శనకు అనుమతించనున్నారు. ఈ నెల 3 మంగళవారం నుంచి మార్చి 31 వరకు సందర్శకుల్ని గార్డెన్ లోపలికి అనుమతిస్తారు. ఢిల్లీలో కాలుష్యం ఎక్కువనే సంగతి తెలిసిందే. ఎప్పుడూ కాలుష్యంతో ఇబ్బందిపడే ప్రజలు.. రాష్ట్రపతి భవన్లో ఉన్న మొఘల్ గార్డెన్ పచ్చదనాన్ని, ప్రకృతిని చూసి పరవశించవచ్చు. ఈ ఏడాది అమృత్ ఉద్యాన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఏడాది సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఇక్కడ ఈ శీతాకాలంలోనే పూల మొక్కలు అందాన్ని సంతరించుకుంటాయి. అందుకే ఈ సమయంలోనే ప్రజల్ని అనుమతిస్తారు.
ఈసారి సందర్శకులు 145 రకాల గులాబి మొక్కల్ని చూడొచ్చు. అర్జున, కృష్ణ, అశ్విని వంటి అరుదైన గులాబీలు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇతర 85 రకాల పూల మొక్కలు కనిపిస్తాయి. ప్రతి రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గార్డెన్ సందర్శించవచ్చు. ఐదు గంటల వరకు ఎంట్రీ ఉంటుంది. హోలీ పండుగ రోజు మాత్రం సెలవు రోజు.