Amit Shah : న్యాయ వ్యవస్ధలో టెక్నాలజీ వాడకంతో మొత్తం వ్యవస్ధ సరళతరం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన కామన్వెల్త్ అటార్నీస్ సొలిసిటర్స్ జనరల్ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్ధను అందరికీ అందుబాటులో ఉండేలా, జవాబుదారీతనంతో, పరిమిత ఖర్చులో న్యాయం అందేలా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
ఈ దిశగా సరైన ఫలితాలు సాధించాలంటే న్యాయ వ్యవస్ధలో టెక్నాలజీ వాడకం పెరగడం కీలకమని స్పష్టం చేశారు. 19వ శతాబ్ధపు చట్టాలతో 21వ శతాబ్ధంలో మనం న్యాయాన్ని ప్రసాదించలేమని పేర్కొన్నారు. సవాళ్లతో కూడిన సంక్లిష్ట సమయంలో న్యాయ వ్యవస్ధలో సాంకేతికతతోనే మొత్తం న్యాయ ప్రక్రియను సరళతరం చేయవచ్చని అమిత్ షా అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు చట్టాల అమలుతో భారత క్రిమినల్ జస్టిస్ వ్యవస్ధ ప్రపంచంలోనే అత్యంతాధునిక క్రిమినల్ జస్టిస్ వ్యవస్ధగా ఎదుగుతుందని షా పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా హాజరయ్యారు.
Read More :