ఇంఫాల్ : మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచారం పతాకస్ధాయికి చేరింది. రాజకీయ పార్టీలు ప్రత్యర్ధి పార్టీలపై ఘాటైన విమర్శలతో విరుచుకుపడుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మణిపూర్ వెనుకబాటుకు దీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ కారణమని కాషాయ పార్టీ ఆరోపిస్తోంది. 15 ఏండ్లలో మణిపూర్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎయిమ్స్ను కూడా తీసుకురాలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు.
మంగళవారం తౌబల్లో జరిగిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో మణిపూర్ ఆర్ధిక వ్యవస్ధ రూ 21,000 కోట్లు కాగా తాము దాన్ని రూ 35,000 కోట్లకు తీసుకువచ్చామని చెప్పారు. ఇక మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 38 స్థానాలకు గాను 30 స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీరెన్ సింగ్ ఇంఫాల్లోని శ్రీవాన్ హైస్కూల్లో సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇంఫాల్ ఈస్ట్లోని హీంగాంగ్ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న బీరేన్ సింగ్ ఓటు వేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాషాయ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. మణిపూర్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 5 వరకూ రెండు దశల్లో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.