Amit Shah : జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) కొనసాగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సహా ఇతర పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజౌరి జిల్లా నౌషేరాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై అమిత్ షా విరుచుకుపడ్డారు. ‘జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగ అధికరణం 370 ని రద్దు చేస్తూ గతంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కానీ తమకు అధికారం వచ్చాక ఆ ఆర్టికల్ను పునరుద్ధరిస్తామని ఫరూక్ అబ్దుల్లా చెబుతున్నారు. ఏ శక్తీ దాన్ని తిరిగి తీసుకురాలేదు. ఇప్పుడు ఈ ప్రాంతంలో బంకర్ల అవసరం లేదు. ఎందుకంటే కాల్పులు జరిపే సాహసం ఎవరూ చేయలేరు. జమ్మూకశ్మీర్లో కేవలం మన దేశ త్రివర్ణ పతకం మాత్రమే రెపరెపలాడుతుంది’ అని అమిత్ షా చెప్పారు.
‘కొందరు పాకిస్థాన్తో చర్చలు జరపాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ ఉగ్రవాదం అంతమయ్యే వరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరిపేది లేదు. దేశంపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను జైలు నుంచి విడుదల చేయాలని కాంగ్రెస్ నేతలుకోరుకుంటున్నారు. కానీ మోదీ సర్కార్ అలా ఎప్పటికీ చేయదు. భారత ప్రజలపై రాళ్లు రువ్విన వారికి కారాగారం నుంచి విముక్తి కల్పించేది లేదు’ అని షా స్పష్టం చేశారు.
కాగా జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న తొలి విడత పోలింగ్ పూర్తయ్యింది. సెప్టెంబర్ 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్ జరుగనుంది. అక్టోబర్ 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.