న్యూఢిల్లీ : కాబూల్ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో.. ఆ ప్రభావం జమ్మూకశ్మీర్పై పడింది. ఆరు బృందాలతో ఉగ్రవాదులు కశ్మీర్ వ్యాలీలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. గత నెల రోజుల నుంచి 25 – 30 మంది ఉగ్రవాదలు జమ్మూకశ్మీర్లోకి ప్రవేశించారని తెలుస్తున్నది. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల హింస చెలరేగిపోతోంది. నెల క్రితం నుంచి ప్రతి రోజు భద్రతా బలగాలపై లేదా రాజకీయ నాయకులపై ఐఈడీ దాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత లాంచ్ ప్యాడ్లపై ఉగ్రవాదుల కార్యకలాపాలు అధికమయ్యాయి. నియంత్రణ రేఖ వెంబడి సుమారు 300 మంది ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు ఆయా నిఘా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో తాము కూడా అప్రమత్తంగా ఉన్నామని భద్రతా అధికారి స్పష్టం చేశారు.
కాబూల్ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు శుభాకాంక్షల మేసెజ్లు సోషల్ మీడియాలో వెలువెత్తుతున్నాయి. ఇటీవలే ఓ వీడియో జమ్మూకశ్మీర్లో వైరల్గా మారింది. తాలిబన్లతో కలిసి ఫైట్ చేసేందుకు వెళ్లిన కొంతమంది యువకులు తిరిగి పాక్ ఆక్రమిత కశ్మీర్కు వచ్చారు. ఆ యువకులకు స్వాగతం పలుకుతున్నట్లు వీడియోలో రికార్డు అయింది. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ పోలీసులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. గత కొద్ది నెలల నుంచి సుమారు 60 మంది యువకులు అదృశ్యమయ్యారు. పని మీద వెళ్తున్నామని చెప్పిన వీరు.. ఇప్పటికీ తిరిగి రాలేదు. ఉగ్రవాద సంస్థల్లో చేరొద్దని యువకులకు పిలుపునిస్తున్నాం. జన జీవన స్రవంతిలో కలవాలని యువకులకు సూచిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.